వనపర్తి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే గిరిజనుల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. పాలమూరు జిల్లా ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, నేడు సాగునీటి రాకతో గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. మంగళవారం ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా గ్రామ పంచాయతీలో గిరిజనుల ఇష్టదైవం తుల్జాభవానీ ఆలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ముఖ్య అతిథులుగా మంత్రి సత్యవతి రాథోడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ 70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గిరిజనులను ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూశాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఏనాడు గిరిజనుల అభివృద్ధికి పాటు పడలేదన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులను గిరిజనులే పాలించుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. తండాల్లో రోడ్లు, మిషన్ భగీరథ నల్లానీళ్లు, ఇతర మౌలిక వసతులు అందాయన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతకు చేయూతనిచ్చిందని చెప్పారు. కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు అండగా నిలుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి నిరంజన్రెడ్డి అత్యంత ఆప్తులని, ఆయన సహకారంతో వనపర్తి జిల్లా అ భివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో నిరంజన్రెడ్డి లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
సంస్కృతి గొప్ప వారసత్వ సంపద : ఎమ్మెల్సీ వాణీదేవి
గిరిజనులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. బడి వందేండ్లు.. గుడి వెయ్యేండ్లు ఉం టుందని, దీనివల్ల ప్రజలు బాగుంటారని ఆమె పేర్కొన్నారు. తుల్జాభవానీ ఆలయం నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. అలాగే ప్రముఖ గా యని మంగ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె నృత్యాలు చేస్తూ లంబాడీ భాషలో పాటలు పాడి అలరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సౌమ్యానాయక్, సర్పంచ్ శాంతాబాయి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వంతెన నిర్మాణానికి శంకుస్థాపన..
ఖిల్లాఘణపురం, అక్టోబర్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు సత్యవతి రాథోడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తెలిపారు. మండల కేంద్రంలోని వనపర్తి-మహబూబ్నగర్ వెళ్లే రహదారిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు రూ.2 కోట్ల నిధులతో బ్రిడ్జిని నాణ్యవంతంగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా కుమ్మరి గేరి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వెంకటరమణ, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు కృష్ణయ్య, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు విక్రం, నాయకులు రవి, బాలీశ్వర్రెడ్డి, ఆంజనేయులుగౌడ్, సురేందర్, సత్యం ఉన్నారు.
రూ.72 కోట్లతో లిఫ్ట్ : మంత్రి నిరంజన్రెడ్డి
రూ.72 కోట్లతో కర్నెతండా లిఫ్ట్ నిర్మిస్తున్నామని, ఈ ఎత్తిపోతల శంకుస్థాపనను ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి ఈ ప్రాజెక్టును సాధించినట్లు ఆయన చెప్పారు. 6 నుంచి 9 నెలల్లో లిఫ్టు నిర్మించి సాగునీటి సమస్య పూర్తిగా లేకుండా చేస్తామన్నారు. వలసలు తగ్గాలంటే సాగునీరు రావాలని, అప్పుడే సమస్య తీరుతుందని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఆయనన్నారు. త్వరలో సొంత జాగా ఉన్న వారికి డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించే పథకాన్ని త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారని తెలిపారు. వైద్య సౌకర్యం కోసం తండావాసులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కర్నెతండా తుల్జా భవానీ ఆలయం తెలంగాణ తుల్జా భవానీ ఆలయంగా విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, ప్రభుత్వానికి తుల్జాభవాని మాత ఆశీస్సులు ఉండాలని మంత్రి అభిలాషించారు. మండలంలోని 24 తండాలకు 20 తండాల్లో పూర్తి స్థాయిలో రోడ్లు వేయించామని, మిగిలిన వాటికి త్వరలో రోడ్లు వేయిస్తానన్నారు.