773 మందికి జరిమానా
రూ.2,98,500 వసూలు
వనపర్తి టౌన్, మే 18 : ప్రభుత్వం లాక్డౌన్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లల్లో ఉంటూ లాక్డౌన్ పాటిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన 773మంది వాహనదారులకు రూ.2,98,500 చలాన్లు విధించమని పట్టణ ఎస్సై మధుసూదన్ తెలిపారు. రాజీవ్ చౌరస్తా, కొత్తకోట రోడ్డు, పెబ్బేర్ రోడ్డు, గోపాల్పేట రోడ్లు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్త్ను చేపడుతున్నట్లు ఎస్సై చెప్పారు.
ఖిల్లాలో కొనసాగుతున్న లాక్డౌన్
ఖిల్లాఘణపురం, మే 18 : మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణతోపాటు, వనపర్తి రోడ్డు, మహబూబ్నగర్ రోడ్లలో ఉన్న షాపులన్నీ మూసిఉంచడంతో నిర్మానుష్యంగా మారింది.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
వీపనగండ్ల, మే 18 : ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్సై వహీద్ అలీబేగ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో లాక్డౌన్ స్థితిగతులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటి రావడానికి అనుమతి ఉంటుందన్నారు. మిగతా సమయంలో బయటికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
కొత్తకోట మండలంలో..
కొత్తకోట, మే 18 : మండల కేంద్రంతోపాటు మండలంలో మంగళవారం లాక్డౌన్ కొనసాగింది. పోలీసులు అనుమతి లేకుండా వాహనాల్లో తిరుగుతే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలు కూడా రోడ్లపైకి అనవసరంగా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యావసర సేవలు తప్ప మిగితా వాటికి రోడ్లపైకి వస్తే జరిమానా విధిస్తున్నట్లు ఎస్సై నాగశేఖర్రెడ్డి తెలిపారు. వాహనాలు రోడ్లపైకి అనుమతి లేకుండా వస్తే అనుమతి పత్రాలు చూయించాల్సి ఉంటుంది.