కోట్పల్లి/ధారూర్ : మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం కోట్పల్లి ప్రాజెక్టులో 5వ విడుత చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని మంత్రి, చైర్పర్సన్ హాజరై మత్స్యశాఖ అధ్యక్షుడు ఆనంద్, ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, ఆనంద్, యాదయ్య, కలెక్టర్ నిఖిలతో కలిసి చెరువులో చేపపిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోట్పల్లి ప్రాజెక్టులో మరో 9 లక్షల చేపపిల్లలను విడుతలవారీగా విడుదల చేస్తామన్నారు. 25 లక్షల పెద్ద సైజు, 14 లక్షల చిన్న సైజు చేప పిల్లలను జిల్లాలో ఉన్న 775 చెరువుల్లో వదులుతామని చెప్పారు.
గతేడాది జిల్లాలో ఉన్న 775 చెరువుల్లో రూ.8కోట్ల61లక్షల విలువచేసే చేపపిల్లలు, 93 నీటి వనరుల్లో 4 కోట్ల రొయ్య పిల్లలను వదిలినట్లు తెలిపారు. కోట్పల్లిలో త్వరలోనే టూరిజం బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 447 మందికి రూ.40లక్షల రుణాలిచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని 105 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 4429 మంది సభ్యులున్నారని తెలిపారు. చెరువుల్లో వంద శాతం రాయితీపై చేపపిల్లలను వదులుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
మత్స్యకారులకు ఆర్థిక సంపద పెరిగింది
సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్
గతంలో చేపల కోసం ఆంధ్రాపై ఆధారపడేవాళ్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు చేయూతనిచ్చి ఆర్థిక సంపదను పెంచింది. మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ పెంచింది. 2016లోనే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 500 ఔట్లెట్ల ఏర్పాటుతో తెలంగాణ చేప వంటకాలతో బ్రాండ్ పేరు అందుబాటులోకి వస్తుంది. గత సంవత్సరం 79.33 లక్షల చేపపిల్లలను ఒక చేప 47 పైసల చొప్పున రూ.34 లక్షల 22వేలు వెచ్చించి చెరువుల్లో వదిలారు. ఈ సంవత్సరం కోటి14లక్షల చిన్నచేపపిల్లలను 775 చెరువుల్లో వదులుతారు.
మత్స్యకారులకు అండ
ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, ఆనంద్, యాదయ్య
చేపలు పట్టి జీవనం సాగించే మత్స్యకారులకు టీఆర్ఎస్ పాలనలో మంచి రోజులు వచ్చాయి. చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారిని ఆదుకుని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారులకు నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు భరోసా కల్పిస్తున్నది. గతంలో 35 టీవీఎస్, 2 టాటా, 1 అశోక్ లేలాండ్ వాహనాలను అందించారు. దీంతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. కార్యక్రమంలో ధారూరు మండల అధ్యక్షులు అనీల్కుమార్, వేణుగోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూనుస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ రాజుగుప్తా, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాయకులు రాజునాయక్, హన్మంత్రెడ్డి, సంతోష్కుమార్, అంజయ్య, వెంకటయ్య, హఫీజ్, బసప్ప, అమర్నాథ్, సర్పంచులు ఉన్నారు.