మహాంతిపూర్ గ్రామానికి నిలిచిన రాకపోకలు
బొంరాస్పేట : మండలంలో శనివారం రాత్రి 18.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో కురిసిన వర్షానికి తోడు ఎగువన ఉన్న దోమ మండలంలో కురిసిన భారీ వర్షానికి కాకరవాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతికి మహాంతిపూర్ గ్రామానికి మండల కేంద్రానికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై వంతెన లేకపోవడంతో ఏటా భారీ వర్షాలు కురిసినప్పుడల్లా వాగు పారడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆదివారం వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షాలకు ఇప్పటికే ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు నిండి అలుగు పారుతుంది. ఏటి కాలువ, ఎల్లమ్మ వాగుల ద్వారా వరద నీరు భారీగా బొంరాస్పేట పెద్ద చెరువులోకి వచ్చి చేరుతుండడంతో చెరువులో నీటిమట్టం పెరుగుతుంది. మండలంలోని కొత్తూరు, బురాన్పూర్, తుంకిమెట్ల, వడిచెర్ల చెరువుల్లోకి వరద నీరు రావడంతో క్రమంగా నిండుతున్నాయి. వర్షాలకు చెరువులు నిండుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.