వికారాబాద్ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖీల తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి గూగుల్ మీట్ ద్వారా ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు.
విజేతలకు 27న బహుమతుల ప్రధానం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి అధికారులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా క్రీడల యువజన సంక్షేమ శాఖ అధికారి హన్మంత్రావు, డీఆర్డీవో, డీఎఫ్వో శాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.