మోమిన్పేట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికే పీఆర్టీయూ ఏర్పడిందని అని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని హెచ్బి ఫంక్షన్హాల్లో పీఆర్టీ యూ మోమిన్పేట శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కూడా ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం 30శాతం పిట్మేంట్ అందించింద న్నారు. పీఆర్టీయూ డిమాండ్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలోని ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చేల్లిస్తుందని, గర్బీణి ఉపాధ్యాయులకు ప్రసవ సమయంలో 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను ఇస్తుందని తెలిపారు.
ఏ జిల్లా ఉపాధ్యాయులు అదే జిల్లాలోని పాఠశాలల్లో ఉద్యోగం ఉండేలా, భార్య, భర్తలు ఉపాధ్యాయులుగా ఉండి వేర్వేరు జిల్లా ఉద్యోగం ఉంటే వారిద్దరికి ఒకే జిల్లా ఉద్యోగం ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయులు పలు సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి సమస్యలు పరిష్కర మయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. అదే విధంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే జీతాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ విజయ్కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఎల్లావేళాల ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
విద్యార్థుల ఆరోగ్యరీత్య పాఠశాలలు పరిశుభ్రంగా ఉండే విధంగా విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తు మాస్కులు ధరించేలా వారికి అవగాహన కల్పించా లన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలలకు తక్కువ మొత్తంలో విద్యార్థులు వచ్చేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించా లన్నారు. చంద్రాయాన్పల్లి కస్తూర్బా పాఠశాలలో రూ. 11 లక్షలతో పైపులైన్ వేయించి పాఠశాలో నీటి సమస్యలు లేకుండా పరిష్కరించమని సూచించారు. కార్యక్రమంలో సొసైటి అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మాణిక్యం, ప్రధాన కార్యదర్శి మల్లేశం, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కమలాకర్ రావ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శివకుమార్, పీఆర్టీయూ జిల్లా మండల సంఘం సభ్యులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.