వికారాబాద్ : నేరస్తులకు సంబంధించిన సాక్ష్యాలను ఎలా సేకరించాలనే విషయాలపై జిల్లా పోలీస్ అధికారులకు ప్రముఖ లీగల్ అడ్వైజర్, లా పుస్తకాల రచయిత ఈ. రాములు శిక్షణ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులకు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్కు దరఖాస్తు వచ్చినప్పుడు సంబంధిత ఎస్హెచ్వో ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలి, నేర పరిశోధనలో భాగంగా ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలపై దిశ నిర్దేశం చేశారు. కేసుకు సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలను సేకరించాలి, నేరస్తులను ఏ విధంగా అదుపులోకి తీసుకుని వారిని ఎలా విచారించాలనే విషయాలపై వివరించారు.
మేజిస్ట్రేట్ ముందు ఎలా హాజరు పర్చాలి, నేర పరిశోధన పూర్తి అయిన తర్వాత చార్జిషిట్ ఏ విధంగా డెవలప్ చేయాలనే విషయాలను తెలియజేశారు. నింధితులకు కోర్టులో శిక్షలు పడుటకు కావాల్సిన మెలకువలను, సాంకేతిక పరమైన సాక్ష్యాదారాలను నేర పరిశోధనకు ఏ విధంగా జోడించాలి, ఎలా భద్రపర్చాలి వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, పరిగి డీఎస్పీ శ్రీనివాస్ రావు, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఆర్ఐఎస్, ఎస్సైలు, ప్రొబేషనరీ ఎస్ఐలు, ఏ ఎస్సైలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.