పరిగి : వికారాబాద్ జిల్లా పరిధిలో కురిసిన భారీ వర్షాలతో తెల్లవార్లు వాగులు, వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి వాగును మోటార్సైకిల్తో దాటుతుండగా గల్లంతైన వ్యక్తి మృతదేహం బయల్పడింది. రాత్రి సమయంలో వాహనదారులు వాగులు దాటకుండా ప్రత్యేకంగా పహారా ఏర్పాటు చేశారు. వర్షాలకు జిల్లాలోని పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరినా పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఆస్తి నష్టం సైతం పెద్దగా జరగలేదని జిల్లా అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచి జిల్లాలో భారీ వర్షం కురియడంతో రాత్రి సమయంలో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షపునీరు పంట పొలాల్లో నిలవడం వల్ల పంటలకు కొంతవరకు నష్టం చేకూరింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 1179 చెరువులు, కుంటలుండగా, దాదాపు అన్ని నీటితో నిండిపోయాయి. మరోవైపు భారీ వర్షాల వల్ల చెరువులన్నీ మరోసారి ఉధృతంగా అలుగులు పారాయి.
వాగులో గల్లంతైన వ్యక్తి మృతి
వికారాబాద్ మండలం పులుసుమామిడి వాగులో సోమవారం రాత్రి మోటార్సైకిల్పై వాగు దాటేందుకు ప్రయత్నించి గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు. పులుసుమామిడి గ్రామానికి చెందిన 7వ వార్డుమెంబర్ ఇషాక్పాష బోర్లు రిపేరు పనిచేస్తున్నారు. హైదరాబాద్కు సామగ్రి కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో శనివారం రాత్రి పులుసుమామిడి వాగును మోటార్సైకిల్తో దాటుతుండగా గల్లంతయ్యాడు. వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఉదయం నవాబుపేట్ మండలం అత్తాపూర్ వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలాన్ని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పూడూరులో అత్యధిక వర్షపాతం…
వికారాబాద్ జిల్లా పరిధిలో పూడూరులో అత్యధికంగా 89.0 మి.మీ., మర్పల్లిలో 45.7 మి.మీ., మోమిన్పేట్లో 32.3 మి.మీ., నవాబుపేట్లో 31.7 మి.మీ., వికారాబాద్లో 65.4 మి.మీ., పరిగిలో 37.3 మి.మీ., కులకచర్లలో 70.3 మి.మీ., దోమలో 26.0 మి.మీ., బొంరాస్పేట్ 61.9 మి.మీ., ధారూర్లో 49.6 మి.మీ., కోట్పల్లిలో 52.3 మి.మీ., బంట్వారంలో 50.2 మి.మీ., పెద్దేముల్లో 59.6 మి.మీ., తాండూరులో 58.4 మి.మీ., బషీరాబాద్లో 37.0 మి.మీ., యాలాల్లో 78.4 మి.మీ., కొడంగల్లో 33.3 మి.మీ., దౌల్తాబాద్లో 58.7 మి.మీ., డాపూర్లో 9.0 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరిగా 49.8 మి.మీ.ల వర్షపాతం నమోదు కాబడింది. వికారాబాద్ జిల్లా పరిధిలో సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు 140.2 మి.మీ.లు సాధారణ వర్షపాతం ఉండగా 233.0 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. తద్వారా జిల్లాలో 66శాతం అధికంగా వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
ఉధృతంగా ప్రవహించిన వాగులు..
తాండూరు కాగ్నా నది, మంచన్పల్లి వాగు, కందనెల్లి వాగు, గాజీపూర్ వాగు, మంచన్పల్లి వాగు వద్ద నిర్మాణంలో రోడ్డు కొట్టుకుపోయి వికారాబాద్-తాండూరు మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కొడంగల్ సమీపంలోని మైసమ్మతాండ వాగు ఉధృతంగా ప్రవహించింది. పరిగి నుంచి వికారాబాద్ రహదారిపై గల పెద్దవాగు సైతం రాత్రి సమయంలో ఉధృతంగా ప్రవహించింది. దోమ మండల పరిధిలోని కాకరవేణి వాగు సైతం ప్రవహించింది. రాత్రి సమయంలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్య లు చేపట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి, పోలీసు కానిస్టేబుల్, వీఆర్ఏలు ప్రతి వాగు వద్ద ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. తద్వారా ఆయా రహదారులపై వాహనాలు వస్తే వాగులు ప్రవహిస్తున్నాయని, వాగులు దాటరాదని వారు సూచించారు. అక్కడక్కడ పాత ఇళ్లకు పాక్షికంగా నష్టం చేకూరింది. భారీ వర్షానికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే స్పందిం చేందుకు జిల్లా స్థాయిలో అధికారులు కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు.