వికారాబాద్ : కుల వృత్తులవారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ రైల్వేగేట్ సమీపంలో వెదురుతో తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ పూర్వం వెదురుతో తయారు చేసిన వస్తువులు ఎక్కువగా వాడుకలో ఉన్నాయన్నారు. పలు రకాల వస్తువులను వెదురుతో ఆకర్శనీయంగా తయారు చేశారని తెలిపారు. వీటిని వివిధ అవసరాల కోసం కొనుగోలు చేయడం వలన తయారు చేసే వారికి కూడా ఎంతో ఉపాధి దొరుకుతుందన్నారు.
ప్రపంచ వెదురు దినోత్సవం కూడా జరుపుకోవడం విశేషమన్నారు. అనంతరం మోదరి మహేంద్ర సంఘం వారిని శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ధారూరు మండల అధ్యక్షున్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వికారాబాద్ పట్టణంలోని గాయత్రీ దవాఖానలో చికిత్స పొందుతున్న ధారూరు మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డిని ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.