వికారాబాద్/ఆమనగల్లు, జనవరి 1: పళ్లైన వారం రోజులకే యువ ఎస్ఐను మృత్యువు కబళించింది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్యాతండాకు చెంది నేనావత్ శ్రీను గతంలో వికారాబాద్లో ప్రొబెషనరీ ఎస్ఐగా విధులు నిర్వహించాడు. డిసెంబర్ 13న వికారాబాద్ ఎస్ఐ-1గా బాధ్యతలు తీసుకున్నాడు. 10 రోజులపాటు విధులు నిర్వహించిన అతడు డిసెంబర్ 26న తన వివాహం ఉన్నదని, డిసెంబర్ 23వ తేదీ నుంచి సెల వు పెట్టాడు. కొకిరాళ్ల తండాకు చెందిన వర్షతో డిసెంబర్ 26వ తేదీన అతడి వివాహం జరిగింది. కాగా శనివారం నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండ లం పోలేపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్రీనునాయక్తోపాటు అతడి తండ్రి కూడా అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివాహం జరిగి వారం రోజులు కూ డా గడువక ముందే రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో వర్ష కన్నీరుమున్నీరవుతున్నది.
మాన్యాతండాలో విషాదం..
ఇంకా పెండ్లి సందడి తగ్గనేలేదు. బంధువులు ఇంటిని వీడనే లేదు. కొన్ని గంటల క్రితం ఆ ఇల్ల్లంతా పలకరింతలతో సందడిగా ఉంది. మాడ్గుల మం డలంలోని కుబ్యాతండా పంచాయతీ పరిధిలోని మాన్యాతండాకు చెందిన మాన్యానాయక్, దస్లీబాయిలకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు శ్రీనునా యక్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 26న వర్ష అనే అమ్మాయితో అతడి వివాహం జరిగింది. శనివా రం అత్త గారింటి నుంచి ఒడిబియ్యం పోసుకొని బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్కు వస్తున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులను వేరే వాహనంలో పంపించిన శ్రీనునాయక్, తన తండ్రి మాన్యానాయక్తో కలిసి ఆటోలో హైదరాబాద్కు వస్తుండగా …హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చింతపల్లి మండలం పోలేపల్లి వద్ద వారు ప్రయా ణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్రీనునాయక్తోపాటు అతడి తండ్రి కూడా అక్కడిక్కడే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్రీనునాయక్, అతడి తండ్రి మృతి చెందిన విషయం తెలియడంతో తండా లో విషాదం నెలకొన్నది. వారం రోజులుగా గ్రామస్తులు, బంధుమిత్రులతో సరదాగా గడిపిన ఎస్ఐ ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెం దడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. స్నేహితులు ఎస్ఐతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని విషాదంలో మునిగిపోయారు.