ధారూరు : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని దోర్నాల్ వాగును, పెద్దెముల్ మండల పరిధిలోని మంచన్పల్లి వాగులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపోర్లుతున్నందున ప్రజలు దగ్గరకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాత్రి పూట అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ధారూరు ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్ధార్ బీమయ్యగౌడ్, ఆర్ఐ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.