వికారాబాద్, ఆగస్టు 5 : గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు అర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టేందుకు చేయూతనిస్తున్నది. స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకుంటే వ్యాపారాన్ని బట్టి ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 648 గ్రామ సమాఖ్య సంఘాలుండగా, ఒక్కో సమాఖ్య పరిధిలో 20 నుంచి 30 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఒక్కో సమాఖ్యలో ముగ్గురు సభ్యులను గుర్తించి వారికి ఆసక్తి ఉన్న రంగంలో మెళకువలు నేర్పాలని ప్రభుత్వం డీఆర్డీవో అధికారులను ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా 3000 మందికి రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. అందుకుగాను దాదాపు 20 రకాల చిన్న తరహా వ్యాపారాలను గుర్తించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 603 మందికి వివిధ వ్యాపారాలకు మంజూరయ్యాయి. వీరికి బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, గ్రామ సమాఖ్య, మండల సమాఖ్యల ద్వారా రుణాలు అందాయి. ఒక్కో మహిళకు వ్యాపారాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణం అందింది. జిల్లాలో లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
పలు విభాగాల్లో దరఖాస్తులు
మిల్క్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, కూల్డ్రింక్, లాండ్రీ, మెడికల్ షాపులు, మెడికల్ ల్యాబ్లు, లెదర్ మొబైల్ రిపేర్ షాపులు, సూపర్మార్కెట్, మాంసం దుకాణాలు, ద్విచక్ర వాహనాల మెకానిక్ షాపులు, తోపుడు బండ్ల వ్యాపారం, పండ్ల దుకాణాలు, టైలరింగ్ షాపులు, టెంట్హౌస్లు, బ్యూటీపార్లర్లు, ఎంబ్రాయిడరింగ్, ఎలక్ట్రీషియన్ పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ఆయా రంగాల్లో ఆసక్తి ఉన్నవారంతా రుణాల కోసం దరఖాస్తు చేశారు. డీఆర్డీవో అధికారులు చొరవ తీసుకుని వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
3000 మందికి లబ్ధి
ప్రభుత్వ చొరవ కారణంగా వికారాబాద్ జిల్లాలో ఒకేసారి 3000 మందికి లబ్ధి చేకూరుతుంది. పొదుపు సంఘాల్లో రాణించేందుకు అవకాశం కల్పిస్తున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది ఒకే మండలంలో ఒకే తరహా వ్యాపారం నిర్వహించకుండా ముందుగానే ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏయే వ్యాపారాలు చేస్తున్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకుని సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు.
మరో నలుగురికి ఉపాధి కల్పిస్తా : శ్యామలమ్మ, నారాయణపూర్, వికారాబాద్
మహిళా గ్రూపులో నాకు రూ.లక్ష రుణం వచ్చింది. కుట్టుమిషన్పై ఆసక్తి ఉండటంతో నాలుగు కుట్టుమిషన్లు కొనుగోలు చేశాను. బట్టలు కుడుతూ స్వయం ఉపాధి పొందుతున్నాను. మా ఊరిలో ఆసక్తి ఉన్న మహిళలకు నాతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తాను. భవిష్యత్లో వారు కూడా సొంతంగా కుట్టుమిషన్లు తెచ్చుకొని ఉపాధి పొందేందుకు ప్రోత్సహిస్తాను. వచ్చిన డబ్బులకు కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటాను.
మా ఊరిలో శారీ సెంటర్ ఏర్పాటు : జహేదాబేగం, నారాయణపూర్
బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష రూపాయలను రుణంగా తీసుకున్నాను. ఊరిలో ఎలాంటి శుభకార్యాలున్నా చీరలు కొనుగోలు చేసేందుకు వికారాబాద్కు వెళ్తున్నారు. మా ఊరిలో శారీ సెంటర్ ఏర్పాటు చేయడంతో కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. ప్రస్తుతం రూ.200 నుంచి 500 ధరల్లో వివిధ రకాల చీరలున్నాయి. గిరాకీ ఎక్కువగా ఉంటే రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు చీరలను తీసుకొచ్చి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాను. చీరలను హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాను.
టిఫిన్ సెంటర్తో జీవనోపాధి : జ్యోతి, నారాయణపూర్
కొన్ని నెలల క్రితం మావారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళా గ్రూపులో రూ.లక్ష వరకు బ్యాంకు రుణం తీసుకున్నాను. నారాయణపూర్ గ్రామ సమీపంలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద టీ, టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. స్వయం ఉపాధి పొందడంతో నాకు సంతోషంగా ఉంది.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : కృష్ణ, డీఆర్డీవో, వికారాబాద్
మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఎదిగేందుకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. గ్రామ సమాఖ్యల ద్వారా ఎంపికైన సభ్యులకు రుణాలు అందజేస్తున్నది. ఇప్పటికే కొందరు తమ గ్రామాల్లో వ్యాపారాలు ప్రారంభించారు. వ్యాపారాలపై శ్రద్ధ వహించి పనులు చేసుకుంటే కుటుంబ పోషణ గడువడంతోపాటు బ్యాంకు రుణాలు త్వరగా తీరుతాయి. వ్యాపారంలో స్థిరపడి ముందుకు సాగితే, ఇతరులకు కూడా ఉపాధి కల్పించేందుకు సిద్ధం అవుతారు. కరోనా సమయంలో ఆలస్యం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. జనవరి, ఫిబ్రవరిలోగా 3000 మంది మహిళలు స్వయం ఉపాధి పొందేలా కృషి చేస్తాం.