షాబాద్/చేవెళ్ల టౌన్, జూన్ 24 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామ సమీపంలోని గంగోత్రి గో నిలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి గోవులకు పూజలు చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నేడు కోటి ఎకరాల మాగాణిగా వ్యవసాయం ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇది రైతు రాష్ట్రమని, రైతు రాజ్యంగా అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో నీరు పుష్కలంగా చేరుతున్నదని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
కాలుష్యాన్ని అంతమొందిస్తున్న ప్రభుత్వం
హరితహారం కార్యక్రమంలో ముమ్మరంగా మొక్కలు నాటుతున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 12,761 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేసి వివిధ రకాలు మొక్కలు పెంచుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో నిత్యం లక్షలాది వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా చెట్ల పెంపకం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరాతో కాలుష్యాన్ని అంతమొందిస్తున్నదన్నారు. అద్భుతమైన వ్యవసాయంతోపాటు ఆహార లభ్యతకు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. తెలంగాణ నేడు స్వయం నిర్ణాయక శక్తిని సమకూర్చుకుందని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అభివృద్ధి బాధ్యత మన పైనే ఉందన్నారు.
సీఎం కేసీఆర్కు సమానమైన నాయకుడు దేశంలోనే లేరు..
ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషల్లో పొరపాటు లేకుండా మాట్లాడే నాయకుడు ఉన్నాడా.. అని తెలంగాణ ఉద్యమంలో అప్పటి నాయకులను తాను ప్రశ్నించానని.. అలా భాష మీద పట్టు, అవగాహన లేని వాళ్లు కేసీఆర్కు ఎప్పటికీ పోటీ కాలేరని చెప్పారు. సీఎం కేసీఆర్కు సమానమైన నాయకుడు దేశంలో కూడా ఎక్కడా లేరన్నారు. ప్రజల బాధలు, ప్రజల అవసరాలు, దాని కోసం చేయాల్సిన ప్రణాళిక రచించి అమలుపరిచే గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. మనం వైరస్ల బారిన పడొద్దంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. తెలంగాణ సమాజానికి నాణ్యమైన ఆహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
గోవులను పెంచడం గొప్ప పరిణామం
ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. పూర్వం చేసే వ్యవసాయ పద్ధతులను నేటి సమాజానికి తెలిసేలా ఏరువాక పౌర్ణమి జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. పెద్దపెద్ద చదువులు చదివిన యువకులు కూడా నేడు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ రోజుల్లో గోవులను పెంచడం గొప్ప పరిణామమన్నారు. గోశాల నిర్వాహకులు వ్యవసాయంపై యువకులకు శిక్షణ ఇస్తామని చెప్పడం మంచి నిర్ణయమని, తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచులు భీంరెడ్డి, విజయలక్ష్మి, ఎంపీటీసీ నరేందర్చారి, నాయకులు రాంరెడ్డి, రమణారెడ్డి, చింటు, కృష్ణారెడ్డి, నాగార్జునరెడ్డి, గోశాల నిర్వాహకుడు హన్మంత్రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులున్నారు.