పరిగి : విధి నిర్వహణలో సమాజ రక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకుని సంస్మరణ దినోత్సవం నిర్వహించబడుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరేడ్ కమాండర్తో కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించడంతో పాటు అమరవీరుల పేర్లు గల పుస్తకాన్ని విడుదల చేసి జిల్లా ఎస్పీకి అందజేశారు. అనంతరం పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21వ తేదీన హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో డీఎస్పీ కరమ్సింగ్ నేతృత్వంలోని 21మంది బీఎస్ఎఫ్ బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా చైనా సైనికులు కాల్పులు జరపడంతో డీఎస్పీ కరమ్సింగ్తోపాటు 10మంది దేశ రక్షణలో వీర మరణం పొందారని గుర్తు చేశారు.
యుద్ధ భూమిలో దేశం కోసం పోరాడి ప్రాణాలు వదలిన వారి కోసం ప్రతియేటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2020 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 2021 ఆగస్టు 31వ తేదీ వరకు దేశ రక్షణలో 377మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి సమయంలోనైనా ప్రజలకు రక్షణ కల్పిస్తూ తమ ప్రాణాలు సైతం తృణ ప్రాయంగా వదిలిపెట్టిన వీర సైనికులను ఒక్కసారి తలుచుకుందామని చెప్పారు. ఇటీవల ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో సైతం పోలీసులు అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కాపాడారని తెలిపారు. వారి సేవలు వెల కట్టలేనివని ఎస్పీ అన్నారు. జిల్లా పరిధిలో సైతం వరదలు వచ్చినప్పుడు తెగిపోయిన రోడ్లు, వంతెనలు, బాటలను మన పోలీసు అధికారులు ముందుగానే గుర్తించి ప్రజలను హెచ్చరించి చేసిన పనులు ఎంతో గొప్పవని ఎస్పీ అభినందించారు. పోలీసులు చక్కగా పనిచేయడం వల్లనే ఇతర శాఖలకు సంబంధించిన అనేక పనులు సైతం పోలీసులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వం పోలీసు శాఖకు అధునాతన వాహనాలు అందజేసిందని తెలిపారు. ప్రతి పని మనది అని పనిచేయాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సూచించారు. గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎంఎ. రశీద్, వికారాబాద్, పరిగి, తాండూరు డీఎస్పీలు సత్యానారాయణ, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.