పరిగి : పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమై న ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో పత్తి కొనుగోలు చేసేందుకు సంబంధించి ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2.02 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్కు వచ్చే అవకాశముందని తెలిపారు. తేమ లేకుండా, రంగు మారని నాణ్యమైన పత్తికి మద్దతు ధర రూ. 6,025 లభిస్తుందని చెప్పారు. జిల్లా పరిధిలో మొత్తం 10 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో ప్రతిరోజు సుమారు 3వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తున్నమన్నారు. రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించాల్సిందిగా సూచించారు. రైతులు తమ వెంట ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పాసు పుస్తకం తీసుకురావాలని చెప్పారు. సీసీఐ వారు అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పత్తి రైతులకు అన్ని మండల కేంద్రాల్లో వ్యవసాయాధికారులు టోకెన్లు, తేదీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దాని ప్రకారం రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని సూచించారు. పత్తిని విక్రయించిన మూడు రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసు అధికారుల సహాయం తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, వ్యవసాయ శాఖ ఏడీ భారతి, సీసీఐ ప్రతినిధి రాజశేఖర్, మిల్లర్లు, మార్కెటింగ్ సెక్రెటరీలు పాల్గొన్నారు.