దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేయనున్నది. రాష్ట్రంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ‘హుజూరాబాద్’ నియోజకవర్గంపాటు మరో నాలుగు మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిని ఎంపిక చేసి సాచురేషన్ మోడ్లో అమలు చేస్తున్నారు. దీంతోపాటు ఇదే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ఈ పథకం అమలు చేసేందుకు సర్కారు రూ.1200కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి జిల్లాలో ఈ పథకం అమలును కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం అమలుపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
దళిత బంధు పథకం కింద ఏ యూనిట్ను ఎంపిక చేసుకోవాలన్నది లబ్ధిదారులదే తుది నిర్ణయం. లబ్ధిదారుడికి రూ.10లక్షలు ఈ పథకం కింద మంజూరు చేస్తారు. ఇందులో నుంచి రూ.10వేలు రక్షణ నిధికి జమ చేస్తారు. భవిష్యతులో ఏదైనా ఇబ్బంది జరిగినపుడు ఈ రక్షణ నిధి ద్వారా లబ్ధిదారుడికి చేయూత లభిస్తుంది. లబ్ధిదారులకు ఏ యూనిట్ ఏర్పాటు చేయాలనే అంశంపై అవగాహన లేకపోతే ఆయా గ్రామాలో ఉన్న పరిస్థితులను పరిశీలించి, ఏ యూనిట్ నెలకొల్పితే బాగుంటుందనే విషయంపై సలహా అందించేందుకు రిసోర్స్పర్సన్లను నియమిస్తారు. లబ్ధిదారులకు భూమి ఎంత ఉన్నది, ఆ గ్రామంలో ఏ యూనిట్ నెలకొల్పితే వారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారనేది సూచిస్తారు. లబ్ధిదారులు స్వంత గ్రామంలోనే కాకుండా ఎక్కడైనా యూనిట్ నెలకొల్పవచ్చు. ఒక కుటుంబానికి చెందినవారు రూ.10లక్షలతో ఒకే యూనిట్ లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు సైతం ఏర్పాటు చేయవచ్చు. వారి పిల్లలు చదువుకున్న వారైతే సుమారు 20 సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇచ్చి యూనిట్ నెలకొల్పుకునే సదుపాయం కల్పిస్తారు. మరోవైపు అన్నదమ్ముల పిల్లలుంటే, వారు కలిసి ఒకే యూనిట్ను నెలకొల్పుకునే సదుపాయం సైతం ఉన్నది. ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించాం. వారి ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే. జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.
సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా సిద్ధం
దళిత బంధు పథకంలో ప్రధానంగా సూచనాత్మక ఆర్థికాభివృద్ధి జాబితాను సిద్ధం చేశాం. లబ్ధిదారులు ఏదైనా వృత్తిలో కొనసాగుతూ అందుకు సంబంధించిన యూనిట్ నెలకొల్పుకోవచ్చు. లేదంటే తమకు ఆసక్తి, అవగాహన గల ఇతర యూనిట్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.
ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ను నియమిస్తాం. కొడంగల్ నియోజకవర్గానికి డీఆర్డీవో, పరిగి నియోజకవర్గానికి జడ్పీ సీఈవో, వికారాబాద్ నియోజకవర్గానికి జిల్లా వ్యవసాయాధికారి, తాండూరు నియోజకవర్గానికి జిల్లా పంచాయతీ అధికారి నోడల్ ఆఫీసర్లుగా.. జిల్లా స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పర్యవేక్షిస్తారు. యూనిట్ల గ్రౌండింగ్కు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కమిటీలుంటాయి. జిల్లాస్థాయి దళిత బంధు మంజూరు కమిటీ చైర్పర్సన్గా జిల్లా కలెక్టర్, జిల్లాస్థాయి గ్రౌండింగ్ కమిటీలో జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, మెప్మా పీడీ, డీఆర్డీవోలు చైర్మన్లుగా ఉంటారు. జిల్లాకు మంజూరైన దళిత బంధు డబ్బులు కలెక్టర్ ఖాతాలో జమ చేయబడతాయి. యూనిట్ల ఎంపిక తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ అన్ని సెక్టార్లకు సంబంధించిన కమిటీలలో సభ్యులుగా ఉంటూ బ్యాంకుల నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు.
తాండూరు, వికారాబాద్ రెండు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో వికారాబాద్ జిల్లా పరిధిలో ఉండగా, పరిగి నియోజకవర్గంలోని రెండు మండలాలు మహబూబ్నగర్ జిల్లాలో, కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలో, రెండు మండలాలు నారాయణపేట్ జిల్లా పరిధిలో ఉన్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలోని ఒకే మండలం వికారాబాద్ జిల్లాలో, మిగతా మండలాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు ఆయా మండలాలవారీగా ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా జిల్లాలో ఎంతమందికి దళిత బంధు అందిస్తారనేది లెక్క తేలుతుంది. అందుకనుగుణంగానే దళిత బంధు నిధులు విడుదలవుతాయి. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత మార్చి 7లోగా జిల్లావ్యాప్తంగా అన్ని యూనిట్ల గ్రౌండింగ్ చేస్తారు.
నియోజకవర్గం ఎస్సీలు కుటుంబాలు
తాండూరు 45760 11964
వికారాబాద్ 71722 20775
పరిగి 45561 11822
కొడంగల్ 28838 5919
చేవెళ్ల 13196 3844
మొత్తం 205077 54324