వికారాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ) : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరను అందజేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటికే 61 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగిలినవి వారం రోజుల్లోగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభమైన కేంద్రాల్లో ఇప్పటికే 1721 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఏప్రిల్ చివరి వారంలో కోతలు ప్రారంభం కాగా, మే మొదటి వారం నుంచే వరి కోతలు పూర్తై ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్, డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో ప్రభుత్వం కొనుగోళ్లను షురూ చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
70వేల ఎకరాల్లో వరి సాగు..
వికారాబాద్ జిల్లాలో యాసంగి సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 20,585 ఉండగా, దాదాపు 70వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. 1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రానుండగా, మిగిలిన 74 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇతర అవసరాలకు, మిల్లులకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 191 కేంద్రాల నుంచి ప్రాథమిక వ్యవసాయ పరపతి(పీఏసీఎస్) 52, ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) 80, వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ) 5, డీసీఎంస్ 54 చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 11 మండలాల నుంచి వరి ధాన్యం వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. మే నెలలో 90వేలు, జూన్లో 10వేల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నది. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి 25 కిలోల బ్యాగులు 25లక్షలు అవసరం ఉండగా, కొత్తవి 2,13,325, పాతవి 11.50లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. టార్పాలిన్లు 1380, వెయింగ్ మిషన్లు 213 సిద్ధంగా ఉంచారు. జిల్లాలో 46 రైస్ మిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఐకేపీకి 5,738 మంది, పీఏసీఎస్కు 6,127 మంది, డీసీఎంఎస్కు 3,573, ఏఎంసీకి 369 మంది రైతుల చొప్పున మొత్తం 15,807 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించనున్నారు. ఐకేపీ 24, పీఏసీఎస్ 19, డీసీఎంఎస్ 16, ఏఎంసీ 2ల చొప్పున కేంద్రాలు ప్రారంభించి, 264 మంది రైతుల నుంచి 1721 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రూ.3కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు రూ.45లక్షలు రైతుల ఖాతాలో జమా చేసి చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.2 కోట్ల పైచిలుకు డబ్బులకు ఇండెంట్ ఇచ్చారు. త్వరలో ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి రానున్నాయి. ‘ఏ’ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,888, సాధారణ రకం క్వింటాలుకు రూ.1,868 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నది.