పరిగి, జనవరి 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం 745 ప్రత్యేక బృందాలు 33250 కుటుంబాల జ్వర సర్వే నిర్వహించారు. జిల్లాలో 220386 కుటుంబాలుండగా అయిదు రోజుల్లో మొత్తం 161808 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. ఈ బృందాల సభ్యులు ఇంటింటికీ తిరిగి జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులున్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి డాక్టర్తోపాటు సూపర్వైజర్ల ఫోన్ నెంబర్లు ఇవ్వడంతోపాటు పై లక్షణాలతో బాధపడుతున్నవారి ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు ప్రతిరోజూ తెలుసుకుంటున్నారు. దీంతోపాటు అర్హులందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. మంగళవారం జిల్లాలో 15-17 సంవత్సరాల లోపున్న 729 మందికి మొదటి డోసు, 18 ఏండ్లు పైబడిన 482 మందికి మొదటి డోసు, 2871 మందికి రెండో డోసు, 60 ఏండ్లు పైబడిన 179 మందికి ప్రికాషనరీ డోసు వేశారు.
2076 మందికి ఐసొలేషన్ కిట్లు అందించిన వైద్యసిబ్బంది
షాబాద్, జనవరి 25 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం 678 వైద్యబృందాలు 61241 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో 2076 మందికి జ్వర లక్షణాలు కనిపించడంతో ఐసొలేషన్ కిట్లు అందించారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాల్లో ఇంటింటి సర్వేలో ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు.