పెద్దేముల్, జూన్ 20 : గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి డీఎంఎఫ్టీ మైనింగ్ నిధులను కేటాయించినట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రేగొండి గ్రామంలో రూ.4లక్షల ఈఎంఎఫ్టీ నిధుల సహాయంతో నూతనంగా నిర్మించనున్న మురుగుకాల్వ నిర్మాణ పనులను సర్పంచ్ హైదర్, ఇతర నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పెసర విత్తనాల మినీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయన్నారు.
ముఖ్యంగా పెద్దేముల్ మండలానికి రూ.2 కోట్ల70లక్షల డీఎంఎఫ్టీ నిధులను కేటాయించి అభివృద్ధిపరుస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత పథకం కింద వానకాలం సీజన్లో పంట పొలాల్లో వేయడానికిగాను కంది, పెసర విత్తనాల మినీ కిట్లను ఉచితంగా అందిస్తున్నదని.. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పెసర విత్తనాల కిట్లను పొంది తమ పంట పొలాల్లో వేసుకొని పంటలను సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు మొదటిసారిగా రేగొండి గ్రామపంచాయతీకి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని సర్పంచ్ హైదర్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, వైస్ ఎంపీపీ మధులత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, సీనియర్ నాయకులు రమేశ్, గోపాల్రెడ్డి, పాషాపూర్ సర్పంచ్ భరత్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు అమలు
తాండూరు రూరల్, జూన్ 20 : కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఉన్నా, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల70వేల చెక్కులను అందజేశారు. అనారోగ్యానికి గురైన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ కావాల్సినవారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు.