వికారాబాద్, జూన్ 12, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతుండగా.. ఇంకో వైపు వానకాలం ప్రారంభమైంది. మున్ముందు సీజనల్ వ్యాధుల ప్రమాదం రాకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అతిసారం, మలేరియా, టైఫాయిడ్, గున్యా, డెంగీ, విషజ్వరాలు ప్రబలే అవకాశం లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పారిశుధ్యం అధ్వానంగా మారినా, తాగునీరు కలుషితమైనా, నీరు నిల్వ ఉన్నా.. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది రోగాలు విజృంభించే అవకాశాలున్నాయి. కొవిడ్కు ఇవి తోడయితే ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడే వీలుంది. జిల్లాలో ఈ పరిస్థితి ఉండొద్దని, నియంత్రించేందుకు స్థానిక అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. గతేడాది మొదటి దశ సమయంలో ప్రజల్లో వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై మరింత అవగాహన పెరిగింది. దీంతో సీజనల్ జ్వరాల సంఖ్య చాలావరకు తగ్గాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సైతం రోజువారీ సాధారణ ఓపీలు, ఐసీలు (కరోనాయేతర కేసులు)పడిపోయాయి. ప్రజారోగ్యంపై ఇదే చైతన్యాన్ని కొనసాగించేందుకు పంచాయతీ, మున్సిపాలిటీ, వైద్యారోగ్య శాఖలు సంయుక్తంగా సిద్ధమవుతున్నాయి.
జ్వరాల నివారణలో భాగంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి వాటిని, సంతతిని నివారించే ప్రణాళికలు రూపొందించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలని ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో పంచాయతీరాజ్ సహా సంబంధిత శాఖల ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేస్తారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించాలని, ఈ సంస్కృతిని వివిధ శాఖలు అభివృద్ధి చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత విస్తృతం
జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వికారాబాద్, పరిగి, మర్పల్లి, కొడంగల్ కేంద్రాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, తాండూరులో జిల్లా దవాఖాన ఉంది. మొత్తం 27 దవాఖానల నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. కాలానుగుణంగా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టనున్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో దోమల నివారణకు ఫాగింగ్, రహదారులు, మురుగు కాల్వల్లో నీటిని ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండ్లల్లో సైతం ప్రతి ఆదివారం ఒక రోజు పొడిదినం పాటించేలా అవగాహన కల్పించాలని జిల్లాలోని ఆశవర్కర్లకు, ఏఎన్ఎంలకు వైద్యారోగ్య శాఖ శిక్షణ కూడా పూర్తి చేసింది. వీళ్లంతా పల్లెల్లోకి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు.
గడిచిన కొద్ది రోజుల క్రితం చేపట్టిన జ్వర సర్వేలో సుమారు 10 వేల కుటుంబాలకు ముందుగానే లక్షణాలను గుర్తించి మందులను అందించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య వారోత్సవాలు పూర్తయితే మరింత బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. 2018లో డెంగీ కేసులు 57, 2019లో 191, 2020లో 27, బోదకాలు 2018లో 1858, 2019లో 1858, 2020లో 2136, మలేరియా 2018లో 4, 2019లో 9, 2020లో 4, చికెన్ గున్యా 2018లో 5, 2019లో 29, 2020లో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రతినెల 1, 11, 21 తేదీల్లో ట్యాంకుల్లో క్లోరినేషన్ చేస్తున్నారు. మిషన్ భగీరథకు సంబంధించి ఎక్కడైనా మరమ్మతులు తలెత్తినా సరఫరా నిలిపివేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ట్యాంకులు 1582, పంచాయతీలకు 3430 బోర్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1197 మంది బహుళ సేవల కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రత్యేక గ్రాంట్లు విడుదల అవుతున్నాయి. ప్రతి నెల దాదాపు రూ.10కోట్ల నిధులు వస్తున్నాయి. ఇందులో 25 శాతం తాగునీరు, 25 శాతం పారిశుధ్యానికి ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.