షాబాద్, జూన్ 12 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో రూ.4.50కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. గజ్వేల్ తరహాలో మహేశ్వరం నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారి కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇంటర్లో చదువు ఆపేయకుండా విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, విద్యనందిస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెద్దఎత్తున అడ్మిషన్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
కరోనా దృష్ట్యా ఆన్లైన్లో డిజిటల్ తరగతులు నిర్వహించినది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. రూ.4వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దీనిపై ఏర్పాటైన మంత్రుల సబ్కమిటీ ద్వారా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలిపారు. జల్పల్లి ప్రభుత్వ పాఠశాలలో రూ. 3కోట్లు వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేసిన సినిమా దాతకు విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మేయర్ పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం, మున్సిపల్ చైర్మన్లు మధు, అబ్దుల్లా, వైస్ చైర్మన్లు భవానీ, ఫర్హానా, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.