కోట్పల్లి, జూన్ 10 : గ్రామాల్లో పింఛన్ల పంపిణీ విషయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా డీఆర్డీఏ అధికారి లక్ష్మీకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శానిటైజర్, మాస్కులు, భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేసుకొని పింఛన్లను పంపిణీ చేయాలని సూచించారు. గ్రామాల్లో మరణించిన వ్యక్తుల కేసుల వివరాలను తప్పకుండా రిజస్టర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఈజీఎస్, నర్సరీలపై మాట్లాడుతూ వచ్చే సంవత్సరానికి మొక్కలు నాటే యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. గ్రామాల్లో మొక్కలను నాటే స్థలాలను గుర్తించడంలో భాగంగా ప్రభుత్వ, రైతు పొలాలు, పాఠశాల ఆవరణ, పార్కుల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. ఇంటింటికీ 6 మొక్కలను పంపిణీ చేసి కార్యక్రమంపై మాట్లాడారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, డీఆర్డీఏ అధికారి కమలాకర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.