కొడంగల్, జూన్ 9: పప్పు దినుసుల అధిక దిగుబడులకు రైతులకు ఉచితంగా పీఆర్జీ 176 కంది రకాన్ని అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జాతీయ ఆహార భద్రత పథకం కింద రైతులకు పీఆర్జీ 176 కంది రకాన్ని ఉచితంగా అందజేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొడంగల్, తాండూర్ ప్రాంతాల్లో అధికరంగా రైతులు కందిని పండిస్తున్నారన్నారు. పప్పు దినుసుల అధిక దిగుబడులకు ప్రభుత్వం అందజేస్తున్న పీఆర్జీ 176 రకం ద్వారా కంది పంట అధిక దిగుబడి వస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాకు మొత్తంగా 150 క్వింటాళ్ల కంది విత్తనాలు మంజూరయ్యాయని తెలిపారు. మొత్తంగా 3700ల మంది రైతులకు ఎకరాకు 4 కేజీలు విత్తనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో పెసర విత్తనాల పంపిణీ చేపట్టాలని వ్యవసాయాధికారులకు సూచించారు. నకిలీ విత్తనాల అమ్మకాలు చేపడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారని చెప్పారు. కొడంగల్ మండలంలోని రుద్రారం, అంగడిరైచూర్తో పాటు దౌల్తాబాద్ మండలాల్లో అధికంగా నకిలీ విత్తనాల అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
నకిలీ విత్తనాలతో పంట నష్టం జరుగుతుందని, రైతులు గుర్తింపు పొందిన డీలర్ వద్దే విత్తనాలను కొనుగోలు చేయాలని, తప్పకుండా రసీదు పొందాలని తెలిపారు. రసీదు ఉంటనే వ్యవసాయాధికారులు ఆన్లైన్లో పంట నమోదు చేస్తారన్నారు. నకిలీ విత్తనాలపై రైతు వేదికల అధికారులు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ధాన్యం నిల్వలకు ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలు, ఫంక్షన్ హాళ్లను ఎంపిక చేసి భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించామని, మొత్తంగా 56 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారని చెప్పారు. విత్తనాలను వ్యవయాసాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటను ఏవిధంగా పండించాలి, ఏ విధంగా సాగు చేయాలనే అంశాలను ఎప్పుటికప్పుడు రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఏడీ వినయ్కుమార్ తెలిపారు. పంటసాగును జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో సమాచారాన్ని పొందపరచనున్నట్లు ఏడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాజేందర్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ రైతుబంధు సమితి అధ్యక్షుడు బస్వరాజ్, మహేందర్, భగవంతు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్కుమార్, రైతులు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోళ్లపై దృష్టి సారించాలి
వరి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మార్కెట్ యార్డ్ను సందర్శించి మార్కెట్ కమిటీ సభ్యులతో పాటు పీఏసీఎస్ చైర్మన్, సివిల్ సైప్లె అధికారితో సమావేశమాయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కేంద్రాలకు వస్తున్న ధన్యాన్ని కొనుగోలు చేసి ధాన్యాన్ని భద్రతపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సైప్లె అధికారి విమల, కొడంగల్, బొంరాస్పేట పీఏసీఎస్ చైర్మన్లు కటకం శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డి, బొంరాస్పేట రైతు బంధు సమితి అధ్యక్షులు మహేందర్, టీటీ రాములు పాల్గొన్నారు.