పరిగి, జూన్ 8: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని కేఎన్ఆర్ గార్డెన్లో సీడ్స్ డీలర్లు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాల యజమానులు, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించినా వెంటనే చర్యలు తీసుకోవడానికి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న కంపెనీలకు చెందిన విత్తనాలు విక్రయించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు సీడ్స్ డీలర్లు సహకరించాలని చెప్పారు.
ఈ విషయాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పించాలని రైతుబంధు కమిటీల కో-ఆర్డినేటర్లకు ఎమ్మెల్యే సూచించారు. ప్రతి గ్రామంలో నకిలీ విత్తనాల విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులు, వ్యవసాయాధికారులకు సమాచారం అందించాల్సిందిగా పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసింది, ఎంత మొత్తంలో కొనుగోలు చేసింది రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈసారి పంటల వివరాల సేకరణ సందర్భంగా రైతులు ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసింది రసీదు చూపించాల్సి ఉంటుందన్నారు. రైతులకు ప్రభుత్వ సూచనల మేరకు ఎరువులు అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ లక్ష్మీరెడ్డి, ఎంపీపీ కె.అరవిందరావు, జెడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, ఏడీఏ వీరప్ప, మండలాల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు రైస్మిల్లర్ల అంగీకారం
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైస్మిల్లర్లు ఒక్కో రైస్మిల్లు 10వేల బస్తాలు కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకోవాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచనల మేరకు రైస్మిల్లర్లు అంగీకరించారు. పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, హరిప్రియ, ఎంపీపీ అరవిందరావు, డీఎస్వో రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి రైస్మిల్లర్లతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఊహించని విధంగా ధాన్యం దిగుబడి వచ్చిందని, రవాణా ఇబ్బందులు ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి రైస్మిల్లు వారు 10వేల బస్తాలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పరిగిలో రెండు ఫంక్షన్హాళ్లను స్టాకు కోసం వినియోగిస్తున్నామని, జాఫర్పల్లిలోని గోదాము, పరిగిలోని మార్కెట్కమిటీ గోదాం సైతం ధాన్యం బస్తాల స్టాకుకు అధికారులు నిర్ణయించారని చెప్పారు. ప్రతి రైస్మిల్లు వారు 10వేల బస్తాలు తీసుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే సూచనతో 16 రైస్మిల్లులకు ఒక్కొ రైస్మిల్లుకు 10వేల బస్తాలు కస్టమ్ మిల్లింగ్కు తీసుకుంటామని రైస్మిల్లర్లు తెలిపారు.