రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
చేవెళ్ల మండలం ఎన్నేపల్లి, ఈర్లపల్లిలో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 10 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ఎన్కేపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యఅతిథులుగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అందరూ చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు, అభివృద్ధి సాధ్యమనేది అంబేద్కర్ ఆకాంక్ష అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రభుత్వం అదనంగా వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. చదువుకున్న యువతకు పారిశ్రామికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదన్నారు. అన్నివ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా వంటి ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్దేనన్నారు.
ఎన్కేపల్లి కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి, చేవెళ్ల టీఆర్ఎస్ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, ముడిమ్యాల సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈర్లపల్లి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో సర్పంచ్ ముత్తంగి రాజశేఖర్, కొల్లగల్ల శ్రీనివాస్, కొల్లగల్ల శివ, యూత్ అధ్యక్షుడు విశాల్, రమేశ్, దయాకర్, గోపులారం ప్రభుగౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.