కలెక్టర్ పౌసుమిబసు
వికారాబాద్, ఏప్రిల్ 10: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 45 ఏండ్లు దాటిన వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానను, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ చేసుకున్నావారితో మాట్లాడారు. మొదటి విడుత వ్యాక్సినేషన్ తర్వాత 28 రోజుల తర్వాత రెండో వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు.
వైద్యాధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా టెస్టింగులు, ట్రేసింగులు, ట్రీట్మెంట్లపై దృష్టి సారించాలన్నారు. హెల్త్ వర్కర్లకు ఫ్రంట్లైన్ వారియర్స్ 45 ఏండ్లు దాటిన వారందరితోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అందిరికి లక్ష్యం ప్రకారం ఈనెల 15 వరకు వ్యాక్సినేషన్ వేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, వైద్యాధికారులు డాక్టర్ యాదయ్య, అరవింద్, మున్సిపల్ కమిషనర్ బిచ్చయ్య పాల్గొన్నారు.