వికారాబాద్, మే 19, (నమస్తే తెలంగాణ)/కొడంగల్: సెంకండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తూ.. ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. దీంతో ప్రజలు పండుగలు, వివాహ వేడుకలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో పకడ్బందీగా నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్కు చెక్ పెడుతున్నారు స్థానికులు. వికారాబాద్ జిల్లాలోని ఆరు తండాల్లో ఇప్పటికీ కరోనా జాడ లేకపోవడమే అందుకు నిదర్శనం.
ఆ తండాలివే..
మర్పల్లి మండలం గుర్రంగట్టతండా, నర్సాపూర్ చిన్న తండా, రాంపూర్, అల్లాపూర్ తండా, కొడంగల్ మండలంలోని గోప్యానాయక్ తండా, ఆశమ్మకుంట తండాల్లో ఇంత వరకు కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. ఇక్కడి ప్రజలంతా పొద్దున్నే వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలం బాట పడుతుంటారు. ఊరిలోకి కొత్తవారిని ఎవర్నీ రానివ్వరు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొవిడ్ నింబధనలు పాటిస్తూ కరోనాను దరి చేరనీయకుండా మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జనాభా వివరాలు..
మర్పల్లి మండలం గుర్రంగట్టుతండా పంచాయతీలో ఆరు వార్డులు ఉండగా 560 జనాభా ఉన్నది. అలాగే రాంపూర్ తండాలో 430 జనాభా ఉన్నది. ఇది ఘనాపూర్ పంచాయతీ పరిధిలో ఉన్నది. పల్గురాళ్ల తండా పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్, ఎక్క చెరువుతండా, పల్గురాళ్ల తండా పరిధిలో 707 మంది జనాబా ఉన్నది. ఈ మూడు తండాల్లో కలిపి 163 ఇండ్లు ఉన్నాయి. అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆశమ్మకుంట తండాలో 200 మంది జనాభా ఉండగా.. 36 ఇండ్లు ఉన్నాయి. గతేడాది కూడా ఈ తండాలలో కొవిడ్ కేసులు నమోదు కాలేదు. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఆశ వర్కర్కు కొవిడ్ పాజిటివ్ వచ్చినా.. ఆమె ఇక్కడ ఉండేది కాదు.
జాగ్రత్తలు.. నిబంధనలు..
గ్రామంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకుని ఉంటూ, భౌతిక దూరం పాటిస్తున్నారు. కొత్తవాళ్లు గ్రామానికి వస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకుని రావాల్సి ఉంటుంది. అత్యవసరం అయితే పంచాయతీ పెద్దలతో మాట్లాడకే ఊరిలోకి అడుగు పెట్టనిస్తారు. ప్రధానంగా ఈ తండాలకు వెళ్లడానికి ప్రధాన రహదారి ఒక్కటే ఉండడంతో కూడా ఎవరు వచ్చినా, వెళ్లినా తెలిసిపోతుంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకే వ్యవసాయ పనులకు వెళ్తారు. అలాగే ఉదయం, సాయంత్రం మాత్రమే దుకాణాలు తెరుస్తారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లోనూ భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకుంటున్నారు. ఈ జాగ్రత్తలన్నింటితో పాటు రోజూ ఊరంతా హైపోక్లోరైట్తో శానిటైజ్ చేస్తారు. కొడంగల్ నియోజకవర్గం అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆశమ్మకుంటతండా, పలుగురాళ్లతండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్తండాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూడలేదు. తండా నుంచి బయటకు వెళ్లడం కానీ వచ్చే వారిపై ప్రత్యేకంగా శ్రధ్ద తీసుకొంటున్నట్లు తండావాసులు తెలిపారు. ప్రస్తుతం ఈ తండాల్లో ఏ ఒక్కరూ అనారోగ్యంతో బాధపడుతున్న దాఖలాలు లేవని, సాధారణ రోజుల మాదిరిగానే జీవనం కొనసాగిస్తున్నారు. కరోనా ప్రభావంపై అధికారులు తెలుపుతున్న సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ.. సాధ్యమైనంత వరకు శుభ్రతలను పాటిస్తున్నట్లు తెలిపారు. సెకండ్ వేవ్ ప్రారంభం నాటి నుంచి స్వీయనియంత్రణ, జాగ్రత్తలు పాటిస్తూన్నామని, ఒకచోట కలిసి ఉన్నప్పటికీ వ్యక్తి గత దూరం పాటిస్తున్నామని ఈ తండాల ప్రజలు తెలుపుతున్నారు. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నట్లు చెబుతున్నారు.
నిబంధనలు కట్టుదిట్టం చేశాం
గ్రామంలో కొవిడ్-19 నిబంధనలు అధికారులు తెలిపిన విధంగా కట్టుదిట్టం చేసి పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వేడి ఆహారమే తింటున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు పొలం పనులకు వెళ్లడం, పనులు చేసే దగ్గర మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తుండటంతో కరోనా వైరస్ మా గ్రామంలో ఎవరికీ సోకలేదు. గ్రామంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే గ్రామ పెద్దల దృష్టికి తీసుకురావాలని నిబంధనలు పెట్టాం.
భౌతిక దూరం పాటిస్తున్నాం..
కరోనా వైరస్ ప్రభాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న కరోనా నిబంధలను పాటిస్తున్నాం. తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం.. చేతులు శానిటైజ్ వంటి జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నాం.
-మోహన్ నాయక్, ఆశమ్మకుంటతండా,
అప్పాయిపల్లి జీపీ, కొడంగల్
వేరే గ్రామాలకు వెళ్లడంలేదు..
రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తండా నుంచి వేరే గ్రామాలకు వెళ్లడం మానేశాం. తండాలో పెండ్లిళ్ల్లు, ఇతర శుభకార్యాలు రద్దు చేసుకున్నాం. అలాగే గ్రామంలో కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకున్నాం. కరోనా వ్యాప్తి తగ్గేంత వరకు కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించక ముందు నుంచే వైద్యాధికారుల సూచనలు స్వచ్ఛందంగా కఠిన నిబంధనలు పాటిస్తున్నాం. నిత్యావసరాల దుకాణాలు కేవలం గంట సేపు మాత్రమే తెరిచేలా చూస్తున్నాం. పకడ్బందీగా స్వీయ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నాం.
-సంతోశ్, గుర్రంగట్టు తండా