వికారాబాద్, ఏప్రిల్ 8, (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నాయి. అయినా ఆశించిన ఫలితాలు రావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో వికారాబాద్ జిల్లాలో హరివిల్లు పేరుతో నూతన కార్యక్రమం అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులకు బాల్యంలోనే పాఠ్యపుస్తకాలతోపాటు ఉన్నత విలువలు పెంపొందించేందుకు కథలు, కృత్యాల ద్వారా అభ్యాసన చేయించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని, సృజనాత్మకశక్తిని పెంపొందించే దిశగా బోధన అందించనున్నారు. ఈ మేరకు 2157 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉదయం, సాయంత్రం వేళల్లో జూమ్ మీటింగ్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. కాగా జిల్లాలో 732 ప్రాథమిక, 113 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, 30వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
నాలుగు బ్యాచ్లుగా శిక్షణ
గతేడాది జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతం చేసినట్లుగానే ఈ సంవత్సరంతోపాటుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో హరివిల్లు కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీవరకు జిల్లాలోని 18 మండలాలను నాలుగు బ్యాచ్లుగా చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు తమ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాద్యాయులందరూ శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి జీ.రేణుకాదేవి ప్రారంభించారు. హరివిల్లు కార్యక్రమం అమలు కోసం మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులను రిసోర్సు పర్సన్లుగా ఎంపిక చేసి జిల్లాలోని ఉపాధ్యాయులను నాలుగు బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో గట్టి పునాది వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నేపాల్, న్యూ ఢిల్లీ వంటి ప్రధాన పట్టణాల్లో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను ఇక్కడ కూడా అమలు చేయనున్నారు.
నాణ్యమైన విద్యాబోధన..
అభ్యాసన ఆనందదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ‘హరివిల్లు’కార్యక్రమాన్ని అమలు చేయనున్నాం. విద్యార్థుల్లో ప్రేమ, వాత్సల్యం, గౌరవం, ఐక్యత, నమ్మకం, నిజాయితీ, ధైర్యం, కృతజ్ఞత వంటి విలువలను రూపొందించేలా బోధన, అభ్యాసన, కృత్యాలను రూపొదించాం. విద్యార్థులు తమ అనుభవాలను నలుగురితో పంచుకునే వీలుంటుంది.
-రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి, వికారాబాద్
ఒక్కోరోజు ఒక్కో అంశంపై బోధన..
సోమవారం -మానసిక సంసిద్ధత మంగళ,బుధవారాలు – కథలు చెప్పడం గురు,శుక్రవారాలు -సమన్వయ కృత్యాలు శనివారం-భావవ్యక్తీకరణ ఇతర అంశాలు
విలువలను నేర్పుతాం..
ప్రేమ, (కరుణ) వాత్సల్యం, గౌరవం, ఐక్యత, నమ్మకం, నిజాయితీ, ధైర్యం, కృతజ్ఞత వంటి విలువలకు సంబంధించి కథలను వివరించుతాం. పరిసరాలపై కూడా అవగాహన కల్పిస్తాం. ‘హరివిల్లు’ విద్యాబోధన చిన్నారులకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేస్తారు.
-రవి, సెక్టోరియల్ ఆఫీసర్, వికారాబాద్