పరిగి, మార్చి 1 : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లా పరిధిలో 101.34% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేండ్ల లోపు చిన్నారులు 93,232 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈమేరకు ఫిబ్రవరి 27న జిల్లావ్యాప్తంగా 670 ప్రత్యేక బూత్లు, 25 మొబైల్ వాహనాలు, 25 రద్దీ ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటుచేసి 86,103 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 28న జిల్లాలోని 1,49,653 ఇండ్లకు వెళ్లిన వైద్య సిబ్బంది 5,776 మంది చిన్నారులకు, మార్చి 1న 47,666 ఇండ్లకు వెళ్లిన సిబ్బంది 2,603 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దీంతో మూడు రోజుల్లో 94,482 మంది(101.34%) చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాంభట్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జీవరాజ్ స్వయంగా పర్యవేక్షించారు. పలు గ్రామాలకు వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.