కొడంగల్ : పట్టణంలోని బాలాజీనగర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలకు చేరుకోవడం వల్ల ఆ పాఠశాలను గాంధీనగర్లోని ప్రాథమిక పాఠశాలకు మార్చాలని డీఈవో రేణుకాదేవి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలాజీనగర్ వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పాటు శ్రీబాలాజీ కేజీ ఉన్నత (ఎయిడెడ్) పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అదే విధంగా 8,9,10 విద్యార్థులు విద్యాశాఖ మంత్రి అందించిన డిక్షనరీలను మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
బాలాజీనగర్ పాఠశాలను పరిశీలించి పాఠశాల భవనం చాలా వరకు శిథిలావస్థకు చేరుకుందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే పాఠశాలను గాంధీనగర్లోని ప్రాథమిక పాఠశాలకు మార్చాలని ఎంఈవో రాంరెడ్డికి సూచించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ముందస్తు చర్యగా పాఠశాలను మార్చాలని తెలిపారు. అదే విధంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల పరిస్థితిలపై ఆరా తీశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలు, విద్యార్థులు పరిస్థితులపై ఆరా తీశారు. కొవిడ్ కారణంగా అన్నింటా జాగ్రత్తలు పాటించి విద్యార్థులకు తరగతులు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.