పరిగి : ఇన్స్ఫేయిర్ 2020-21 విద్యా సంవత్సరంలో జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుల్లో 3వ స్థానంలో నిలిచిన దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి అశోక్ను జిల్లా కలెక్టర్ నిఖిల అభినందించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థి అశోక్ను కలెక్టర్ ఘనంగా సన్మానించి, ల్యాప్టాప్ను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తయారు చేసిన సీలింగ్ ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం జిల్లా విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థికి మార్గదర్శనం చేసిన గైడ్ టీచర్ శాంతకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమప్ప, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్ను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, సెక్టోరియల్ అధికారి రవి పాల్గొన్నారు.