బొంరాస్ పేట : ఓ యువకుడిని ఎస్సై కొట్టాడని బాధితుని కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని నాందార్పూర్ గ్రామానికి చెందిన కోట్ల మల్లేశ్కు, రాఘవేందర్, అతని స్నేహితులకు మధ్య ఈ నెల 15వ తేదీ రాత్రి గొడవ జరిగింది. దీనిపై మల్లేశ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవేందర్ అతని స్నేహితులను విచారణ కోసం ఆదివారం ఎస్సై వెంకటనారాయణ పోలీసు స్టేషన్కు పిలిపించారు. విచారణ క్రమంలో రాఘవేందర్ను ఎస్సై కొట్టడంతో సొమ్మసిల్లి కిందపడిపోయాడు. దీంతో వెంట వచ్చిన కుటుంబీకులు ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు.
గంట వరకు ఆందోళన నిర్వహించగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ అప్పయ్య వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీలో చికిత్స పొందుతున్న రాఘవేందర్ను డీఎస్పీ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొడవకు గల కారణాలను కొడంగల్ సీఐ అప్పయ్యతో కలిసి డీఎస్పీ నాందార్పూర్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.