ధారూరు, మే 30 : ‘పల్లె ప్రగతి’తో ధారూరు మండలం చింతకుంట గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు సమస్యలతో సతమతమైన పల్లె నేడు చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామానికి వెళ్లే రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటడంతో పచ్చని తోరణాల్లా కళకళలాడుతున్నాయి. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చేత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తుండడంతో స్వచ్ఛ గ్రామంగా మారుతున్నది. ప్రతి వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇంకుడు గుంతలను నిర్మించారు. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను నాటడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. మున్ముందు చేపట్టే హరితహారానికి గ్రామ నర్సరీలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వైకుంఠధామం, డంపింగ్ యార్డుతోపాటు పలు అభివృద్ధి పనులను చేపట్టడంతో గ్రామ రేఖలు పూర్తిగా మారాయి. ఒకప్పుడు తాగునీటికి నానా ఇబ్బందులు ఎదుర్కోగా నేడు మిషన్ భగీరథతో ఇంటింటి నల్లాలను బిగించడంతో తాగునీటి సమస్య సమసిపోయింది. అంతేకాకుండా అన్నదాతలు ఒకే చోటుకు చేరి సాగు సమస్యలు, విధానాలను చర్చించుకునేందుకు వేదికగా రైతువేదిక భవనం అందుబాటులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమర్థవంతంగా పారుశుధ్య నిర్వహణ…
గ్రామంలో ‘పల్లె ప్రగతి’లో భాగంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి, ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. తడి-పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. చెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ రెండు చెత్త బుట్టలనూ పంపిణీ చేశారు. ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతో గ్రామం కొత్త శోభను సంతరించుకున్నది. ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్లున్నది.
పల్లె ప్రకృతి వనం, నర్సరీ..
పల్లె ప్రకృతి వనంలో 1830 మొక్కలను నాటి వాటి చుట్టూ కంచే వేశారు. మధ్యలో వాకింగ్ కోసం అందమైన రోడ్డు, వాటిని కాపాడేందుకు గేటును ఏర్పాటు చేశారు. గ్రామ నర్సరీలో మొత్తం 11వేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామ నర్సరీలో టేకు, తులసీ, జామ, టైకోమా, జీడి, నీమ్మ ఖర్జూర, గజ్జకాయ, ఉసిరి తదితర మొక్కలను పెంచుతున్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామం అభివృద్ధి..
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.4 లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం, రూ.10 లక్షలతో వైకుంఠధామం నిర్మాణం, రూ.2 లక్షలతో కంపోస్టు షెడ్డును నిర్మించారు.