ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : కొవిడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్లో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ఎలాంటి కార్యక్రమాలైనా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో 44 ఆర్అండ్బీ పనులకు గానూ 7 మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఇబ్బందికరంగా ఉన్న రహదారులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు.
మాస్కులు తయారు చేయించాలి..
శ్రీనిధి మహిళా సంఘాలు మాస్కులు తయారీ చేయగలుగుతారు. వారితో క్లాత్ మాస్కులు తయారు చేయడం నేర్పించాలని సూచించారు. అర్హులైన ప్రైవేటు టీచర్లందరికీ బియ్యం, రూ.2వేల ఆర్థిక సాయం అందజేయాలన్నారు.
జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ..కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. వాక్సిన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వేస్తామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాపై సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దిలీప్కుమార్, జడ్పీటీసీలు మాలతి, కృష్ణారెడ్డి, తన్విరాజు, జంగమ్మ, వెంకట్రామిరెడ్డి, యాదయ్య, శ్రీకాంత్, కోఆప్టివ్ సభ్యులు అక్బర్అలీఖాన్, ముజీబ్, రెహ్మన్ పాల్గొన్నారు.