షాబాద్/పరిగి, మే 29 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సూపర్స్పైడర్స్కు వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉమ్మడి రంగారెడ్డి షాబాద్/పరిగి, మే 29 : జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు 8194 మంది టీకా తీసుకున్నారు. శనివారం 23 కేంద్రాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. టీకా తీసుకున్నవారిలో జర్నలిస్టులు, రేషన్, ఫర్జిలైజర్, ఎల్పీజీ డీలర్లు, పంచాయతీ సిబ్బంది, పెట్రోల్ బంక్, గ్యాస్ సరఫరా సిబ్బంది తదితరులు ఉన్నారు. వైద్య సిబ్బంది, ఇతర మండలస్థాయి అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మిగిలినవారికి ఆదివారం కూడా వ్యాక్సినేషన్ వేయనున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, షాబాద్లో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ దామోదర్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని సూచించారు. ఇక వికారాబాద్ జిల్లాలో రెండో రోజు 19 కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించగా 761 మందికి టీకా వేశారు. రేషన్ డీలర్లు 216 మంది, ఎల్పీజీ సిబ్బంది 154, ఎఫ్సీఐ 54, జర్నలిస్టులు 82, ఫర్జిలైజర్, పెస్టిసైడ్ సిబ్బంది 206, ఇతరులు 134 మంది టీకా వేయించుకున్నారు.
సూపర్ స్ప్రెడర్లందరికీ టీకా ఇవ్వాలి
మొయినాబాద్, మే29: సూపర్ స్ప్రెడర్స్గా గుర్తించిన వారందరికీ కొవిడ్ టీకా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ వివిధ శాఖల అధికారులకు , వైద్యాధికారలకు సూచించారు. మండల పరిధిలోని పెద్దమంగళారంలో ఏర్పాటు చేసిన సూపర్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఎంత మందిని గుర్తించారు..ఎంత మందికి వ్యాక్సిన్ వేశారు అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ , వ్యాక్సిన్ ఇచ్చే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ అనిత, ఏవో రాగమ్మ, వైద్యాధికారి రోహిణి, ఎంపీడీవో విజయలక్ష్మి, డిప్యూటీ తాసీల్దార్ తాజాద్దీన్, సర్పంచ్ కోట్ల నరోత్తంరెడ్డి ఉన్నారు.