మెడికల్ క్యాంపులు ఏర్పాటు
ప్రతి ఓటరుకూ టెంపరేచర్ టెస్ట్
లక్షణాలుంటే ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
పరిశుభ్రతపై మున్సిపల్ సిబ్బంది చర్యలు
సోడియం హైపోక్లోరైట్తో కేంద్రాలు శుభ్రం
కొత్తూరు, ఏప్రిల్ 28 : ఈ నెల 30 జరిగే కొత్తూరు మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో శుభ్రతపై దృష్టి సారించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద ఏఎన్ఎం, ఆశ వర్కర్ల ఉంటారు. ఓటర్ల టెంపరేచర్ చూసి ఓటు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. లక్షణాలు ఉన్న వారు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్కు ధరించి ఓటు వేసేందుకు రావాలన్నారు. భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హెల్త్ సమస్యలు వచ్చినా క్యాంపులో పరీక్షించి తగు సూచనలు, సలహాలు ఇస్తామని కొత్తూరు పీహెచ్సీ డాక్టర్ కవిత తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమయితే 108ను సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపల్ కార్మికులు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న చెత్తాచెదారం తీసివేశారు. అనంతరం సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేశారు.