జిల్లాలో రోజుకు 5 వేలకు పైగా వ్యాక్సినేషన్
భయాందోళన వీడి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి
కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
రోజుకు 500లకు పైగా పాజిటివ్ కేసులు
మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించండి
కొవిడ్ నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజకు పెరుగుతున్నది. వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ను నిరాంతరాయంగా కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలనూ పెంచుతున్నది. జిల్లావ్యాప్తంగా శానిటైజేషన్తోపాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు పెరుగడంతో 25 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి శానిటైజేషన్ చేశారు. పలు ప్రైవేటు దవాఖానల్లో వసతులు లేకున్నా చేర్చుకోవడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తదితర వివరాలను తెలుసుకునేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మితో ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..
నమస్తే, ప్రతినిధి : జిల్లాలో కొవిడ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
డీఎంహెచ్వో : ప్రజలకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పిస్తున్నాం. కరోనా పరీక్షల సంఖ్యనూ పెంచాం. కొవిడ్ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాం. జిల్లాలో శానిటైజేషన్, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా అమలు చేస్తున్నాం.
నమస్తే, ప్రతినిధి : కరోనా పరీక్షలు రోజుకు ఎన్ని చేస్తున్నారు,
ఆర్టీపీసీఆర్ నమూనాలను ఎక్కడికి పంపిస్తున్నారు.
డీఎంహెచ్వో : జిల్లావ్యాప్తంగా రోజుకు 2 వేలకుపైగా కరోనా పరీక్షలు చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 6,58,542 మంది నమూనాలను సేకరించగా, ఆర్టీపీసీఆర్ 71,163 నమూనాలు, ర్యాపిడ్ టెస్టులు 5,87,439 మందికి చేశాం. పాజిటివ్ వచ్చిన వారితోపాటు వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. హోంఐసో లేషన్లో ఉన్న వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆర్టీపీసీఆర్ నమూనాలను హైదరాబాద్లోని ఈఎస్ఐ దవాఖానకు పంపిస్తున్నాం. 36 గంటల్లో ఫలితాలను అందజేస్తున్నాం.
నమస్తే, ప్రతినిధి : వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇంకా కొంతమంది వ్యాక్సిన్
తీసుకునేందుకు భయపడుతున్నారు, వారికి మీరిచ్చే సలహా ఏమిటీ ?
డీఎంహెచ్వో : జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. రోజుకు 5 వేల మందికిపైగా వ్యాక్సినేషన్ చేస్తున్నాం. 15 రోజులుగా ప్రజల్లో మార్పు వచ్చింది, స్వచ్ఛందంగా ముందుకొస్తుండడంతో వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. వ్యాక్సినేషన్పై ఎలాంటి అపోహలొద్దు, నిర్లక్ష్యాన్ని వీడి వ్యాక్సిన్ వేయించుకొండి. మనతోపాటు మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించు కోవాలి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి రోగ నిరోధక శక్తి పెరిగి పాజిటివ్ బారిన పడకుండా ఉంటారు. జిల్లావ్యాప్తంగా 49 ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం.
నమస్తే, ప్రతినిధి : మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్కు
సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
డీఎంహెచ్వో : ప్రస్తుతం 45 ఏండ్లకుపైబడిన వారికి వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలందిన వెంటనే 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం.
నమస్తే, ప్రతినిధి : జిల్లాలో ఎన్ని దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి.
డీఎంహెచ్వో : జిల్లాలోని వనస్థలిపురం ఏరియా దవాఖానతోపాటు కొండాపూర్లోని జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. రోజుకు 100
పడకలకు సరిపడా ఆక్సిజన్ ఉంటుంది.
నమస్తే, ప్రతినిధి : పలు ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ చికిత్సకు అవసరమైన వసతులు
లేనప్పటికీ కొవిడ్ బాధితులను చేర్చుకోవడం, చివరి నిమిషాల్లో చేతులెత్తే స్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి, మీ దృష్టికి ఏమైనా వచ్చాయా ?
డీఎంహెచ్వో : ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు, ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే
తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాం. కొవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని వసతులు ఉంటేనే రోగులను చేర్చుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.