నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఐజీ శివశంకర్రెడ్డి
పోలీస్ చెక్పోస్టుల పర్యవేక్షణ
కొడంగల్,/ పూడూరు, మే 26: జిల్లాలో లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఐజీ శివశంకర్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంతో పాటు జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాలను, హైదరాబాద్-బీజాపూర్ హైవే 163 రహదారిలోని కొడంగల్ మండలం రావులపల్లి గ్రామ చెక్పోస్టు వద్ద ఆయన తనిఖీలు నిర్వహించారు. అలాగే పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి స్టేజి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును సందర్శించి తనిఖీలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ముఖ్య ఉద్దేశం కరోనా వైరస్ ఉధృతిని కట్టడి చేసేందుకే అన్నారు. కావున ప్రజలు సహకరించి కరోనా మహమ్మారికి చరమగీతం పాడాలని కోరారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కఠిన నిబంధనలు అమలులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో జిల్లాలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతున్నదని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 2500 వాహనాలను సీజ్ చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన విషయమై 7వేల కేసులు నమోదైనట్లు తెలిపారు. రావులపల్లి చెక్పోస్టును సందర్శించి లాక్డౌన్ ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను పరిశీలించినట్లు తెలిపారు. కర్ణాటక సరిహద్దు చెక్పోస్టు కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పరిశీలించి, ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తున్నట్లు ఎస్సీ నారాయణ ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు లేకుండా వచ్చే వాహనాలపై, వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చెక్పోస్టు సిబ్బందికి ఐజీ డ్రై ఫ్రూట్స్, శానిటైజర్లు, మాస్క్లు పంపిణీ చేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. లాక్డౌన్ విధించడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు కూడా తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ సిబ్బంది విధులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పరిగి డీఎస్పీ విజయ్కుమార్, సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్సై శ్రీశైలం సీఐ అప్పయ్య, ఎస్ఐలు సమ్యానాయక్, మహిపాల్రెడ్డితో పాటు చెక్పోస్టు సిబ్బంది పాల్గొన్నారు.