ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్పేట్, మే 25 : కొవిడ్ బారిన పడిన బాధితులు ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం సబిత ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోమిన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కొవిడ్తో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవిడ్తో చికిత్స పొందుతున్న వారి కోసం ఐసొలేషన్ కేంద్రంలోనే పౌష్టిక ఆహారం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో అందరికి పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రత లాంటివి.. నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామన్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ అవసరం ఉంటే దగ్గరలో అందుబాటులో ఉన్న దవాఖానకు పంపిస్తామని తెలిపారు. రోగుల వినోదం కోసం ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటు చేశామన్నారు. ఐసోలేషన్ కేంద్రం పరిసర ప్రాంతాలన్నింటిని ఎప్పటికప్పుడు గమనించేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను బిగించారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకుడు వెంకట్ ఉన్నారు.