బంట్వారం, జూన్ 23: ఎర్రమట్టి నేల.. బండ పరుపు. అయినా పట్టువిడువకుండా ప్రకృతి వనం ఏర్పాటుకు పూనుకున్నారు. దీంతో ఏడాది కిందట నాటిన మొక్కలు నేడు చెట్లయ్యాయి. పండ్ల చెట్లు ఫలాలిస్తున్నాయి.. పూల మొక్కలు పువ్వుల నిస్తున్నాయి. పచ్చదనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఏపుగా పెరిగిన మొక్కలు చిట్టడివిని తలపిస్తున్నాయి. మండలంలోని తొరుమామిడి పల్లె ప్రకృతి వనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నట్లు అధికారులు చెబుతుంటారు. కొన్ని రోజుల క్రితం మండలంలో పర్యటించిన అధికారులు ఈ పార్కును డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఈ పార్కు వీడియోను చూసిన ఆయన పచ్చని మొక్కలతో అందంగా ఉందని, ఇలా ఉండాలని మెచ్చుకున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గుర్తుచేశారు. జిల్లాలో ఇలాంటి పార్కులు ఉండాలని, అంద రూ ఇలాగే చేయాలని అధికారులకు ఆమె సూచించినట్లు ఎంపీడీవో బాలయ్య, ఏపీవో సుధాకర్ తెలిపారు.
ఎకరంలో ప్రగతి వనం
ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు నిర్మించాలని చెప్పడంతో సర్పంచ్ స్ఫూర్తితో పాటు సిబ్బంది గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఎర్రమట్టి నేలలే. ప్రభుత్వ భూమి ఒక ఎకరం ఉన్నప్పటికీ బండ పరుపు నేల కావడంతో జేసీబీతో చదునుచేశారు. ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్వించి మొక్కలు నాటారు. పార్కులో సుమారు 6 వేల మొక్కల వరకు నాటగా ప్రస్తుతం 4400 ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
పార్కులో రకరకాల మొక్కల పెంపకం
వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మొక్కలను పా ర్కులో నాటారు. అందులో ప్రధానంగా బాహిసీ యా, మలబార్వేప, బాదాం, మారేడు, అల్లనేరే డు, రావి, జామ, పారిజాతం, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, శ్రీగంధం, ఇప్ప, రేగు, పనస, జంబి, కొబ్బర, పోక, ఆకాశమల్లె, పొగడ, మహాగని, మ ల్లె, తులసి, గన్నేరు, చిన్న సంపెంగ, కృష్ణతులసి, నందివర్ధనం, బాగన్ వితియా, గులాబీ, వెదురు, కోనకర్పస్, తుభూజీయ రొజీయా, నూరువరా లు, మందారం, కీసర్, పుమాదియాపుతిక్, బ్యాక్ సైకన్, స్టార్ ఫైట్, తూజ, జట్రోపా, పాపయ్య, మునగ, ఉసిరి, చింత మొక్కలు నాటారు.
సవాలుగా పార్కు అభివృద్ధి
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లె ప్రకృతి వనాల పథకంతో గ్రామాల్లో మంచి వాతావరణం నెలకొంటున్నది. ఆయన సంకల్పాన్ని పూర్తిచేయాలని సవాలుగా తీసుకున్నాం. బండరాళ్లు ఉన్న భూమిని చదును చేసి, మొక్కల ఎదుగుదలకు గుంతలు తవ్వి, మట్టితో నింపాం. దానికి తగ్గట్టు మొక్కలను వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి నాటాం. ఏడాదిలో అవి ఏపుగా పెరిగాయి. జామ, పొపాయ, మునగ, రేగు లాంటి మొక్కలు కాతకాస్తున్నాయి. పార్కు నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇతర ఖర్చులు గ్రామ పంచాయతీ ద్వారా ఖర్చు చేశాం.
ప్రత్యేక సిబ్బందిని నియమించాం
పార్కు అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా పంచాయతీ సిబ్బందిని నియమించాం. ప్రతి రోజూ పార్కులో ఏదో ఒక పని ఉంటుంది. నీళ్లు వదలడం, కలుపు తీయడం, ఎండిన మొక్కల తొలగింపు, ఇలా ప్రతి పని చేయాలన్న ప్రత్యేకంగా ఒకరిద్దరు సిబ్బంది ఇక్కడే ఉండాల్సి వస్తున్నది. దీనికి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలను పెట్టుకోవడం వల్ల ప్రతిసారి వారు మారుతున్నారు. దీంతో నిర్వహణపై అవగాహన లేక పనులు సక్రమంగా సాగడం లేదు. పంచాయతీకి ప్రత్యేక నిధులు ఇచ్చి, ఒకరిద్దరిని కాపలదారులు, నిర్వాహకులుగా నియమిస్తే మరింత అభివృద్ధి చేయవచ్చు.