కొడంగల్, మే 21: దోమలు కుట్టడం వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని, జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని జోనల్ సహాయ సంచాలకుడు నాగయ్య పేర్కొన్నారు. శుక్రవారం జోనల్ మలేరియా కార్యాలయం హైదరాబాద్ నుంచి అధికారులు మండలంలోని లక్ష్మీపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో డెంగీ వ్యాధికి కారణమయ్యే దోమలను పరిశీలించి, వ్యాధిపట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 జులైలో కొడంగల్ మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో ఒక చిన్నారికి, తాండూరులోని సాయిపూర్ గ్రామంలో ఒకరికి మెదడువాపు వ్యాధి వచ్చినట్లు తెలిపారు. లక్ష్మీపల్లి గ్రామ చిన్నారిని హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందించామని, తరువాత చిన్నారి ఆరోగ్యంగా ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న పరిస్థితి, ఎవరికైనా వ్యాధి సోకిందా, చిన్నారులకు మెదడువాపు వ్యాక్సినేషన్ అందిచారా, దోమల పరిస్థితిపై పరిశీలించేందుకు గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. డెంగీ వ్యాధికి కారణమైయ్యే దోమ మైదానాల్లో పెరిగిన గడ్డి, వరి పొలాల్లో పెరిగి 5 కిలోమీటర్ల దూరంలో వీటి ప్రభావం ఉంటుందని తెలిపారు.
దోమల ద్వారా డెంగీ, చికున్గున్య తదితర వ్యాధులు వ్యాప్తిస్తాయని, మురుగు గుంటల్లో, కాల్వల్లో ఉండే దోమల వల్లే వ్యాధులు సంభవిస్తాయని అవగాహన కల్పించారు. డెంగీ, చికన్గున్యకు కారణమయ్యే దోమలు ఇంట్లోని మంచినీటిలో పుట్టి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. ఇంట్లో నీటి నిల్వలపై మూతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డెంగీ వ్యాధికి సంబంధించి 9 నెలలు, సంవత్సరంన్నర చిన్నారులకు రెండు దఫాలుగా వ్యాక్సినేషన్ అందించాల్సి ఉంటుందన్నారు. గ్రామంలో సగం మంది చిన్నారులకు మాత్రమే టీకా అందినట్లు గుర్తించామన్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందించే విధంగా సిబ్బందికి ఆదేశించారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టాలని, గ్రామంలో టీమీఫాస్, పైరత్రం మందు పిచికారీ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో వై.గంగప్ప, సబ్ యూనిట్ అధికారులు విజయ్కుమార్, రాజు, హెల్త్ అసిస్టెంట్ మధుతో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.