పరిగి, జూన్ 19: వికారాబాద్ జిల్లావ్యాప్తంగా కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఉద్యానవన శాఖ అందిస్తున్నది. ఇందుకోసం జిల్లాలో 2021-22 సంవత్సరానికి సంబంధించి ఉద్యానవన శాఖ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. దీంతోపాటు సబ్సిడీపై కూరగాయల నారు, యంత్రాలు, వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు నిర్ణయించారు. ఈసారి పెద్దఎత్తున కూరగాయలు, పండ్లతోటల సాగు విస్తీర్ణం పెంచడానికి అవసరమైన మేరకు సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయనున్నది. తద్వారా జిల్లావ్యాప్తంగా ఉద్యానవన పంటలు, తోటల సాగు మరింత విస్తరించనున్నారు.
పండ్లతోటలు.. కూరగాయలకు సబ్సిడీ
జిల్లావ్యాప్తంగా ఈసారి 30 హెక్టార్ల విస్తీర్ణంలో అరటి తోటలు పెంచేందుకు సర్కారు ప్రోత్సాహం అందించనున్నది. ఇందులో భాగంగా ఒక హెక్టారుకు రూ.30వేల చొప్పున సబ్సిడీగా అందించనున్నది. బొప్పాయి తోటలను 20 హెక్టార్లలో పెంచేందుకు ప్రోత్సాహిస్తున్నది. ఇందుకు హెక్టారుకు రూ.22,500 సబ్సిడీ అందజేస్తారు. మామిడి తోటలను 15 హెక్టార్లలో పెంచేందుకు హెక్టారుకు రూ.9,800 సబ్సిడీని ఇవ్వనున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. నిమ్మ తోటలు 3 హెక్టార్లు, బత్తాయి 3 హెక్టార్లలో ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ అందజేయనున్నారు. ఇందుకు ఒక్కో హెక్టారుకు రూ.9,600 సబ్సిడీ ఇస్తారు. జామ పండ్ల తోటలను 13 హెక్టార్లలో పెంచడానికి ఏర్పాట్లు చేశారు. ఒక్కో హెక్టారుకు 17,600 సబ్సిడీ ఇవ్వనున్నారు. జిల్లావ్యాప్తంగా 84 హెక్టార్లలో పండ్లతోటలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందనున్నది. జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ తోటలకు సంబంధించి పలుచోట్ల 4 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో హెక్టారుకు రూ.96వేలు సబ్సిడీ ఇవ్వనున్నారు. వీటితోపాటు కూరగాయల సాగుకు ప్రోత్సాహించనున్నారు. ఇందులో భాగంగా ఈసారి 50 హెక్టార్లలో టమాట, మిరప, వంకాయ సాగుకు హెక్టారుకు రూ.20వేలు సబ్సిడీ అందజేయనున్నారు. టమాట, మిరప, వంకాయ నారును సబ్సిడీపై జీడిమెట్ల, ములుగు నుంచి సరఫరా చేయనున్నారు. రైతులు తమ వాటాగా టమాట, వంకాయకు సంబంధించి ఒక ఎకరాకు రూ.1,500, మిరపకు రూ.1,280 డీడీ రూపంలో చెల్లించాలి. వీటితోపాటు ఫాంపాండ్ల నిర్మాణానికి సంబంధించి జిల్లాలో 4 యూనిట్లు మంజూరుచేసింది. ఒక్కో యూనిట్కు రూ.75వేలు అందజేయనున్నారు.
సబ్సిడీపై మినీ ట్రాక్టర్లు..
పండ్లతోటల్లో నడిపేందుకు వీలుగా చిన్న ట్రాక్టర్లు సన్న, చిన్నకారు రైతులకు ఒక యూనిట్, ఎస్సీ, ఎస్టీలకు ఒక యూనిట్ మంజూరయ్యింది. ఒక యూనిట్కు లక్ష రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తున్నది. జిల్లాకు 8 బ్రష్కట్టర్లు మంజూరవగా పెద్ద రైతులకు 2 యూనిట్లు వాటిలో ఒక యూనిట్కు రూ.12వేలు, సన్న, చిన్నకారు రైతులకు 4 యూనిట్లు, ఎస్సీ, ఎస్టీలకు 2 యూనిట్లు మంజూరవగా ఒక్కో యూనిట్కు రూ.15వేలు సబ్సిడీ అందించనున్నారు. మందుల పిచికారీకి సంబంధించి ట్రాక్టర్కు అమర్చే స్ప్రేయర్లు జిల్లాకు 8 యూనిట్లు మంజూరవగా, ఒక్కో యూనిట్కు రూ.63వేలు సబ్సిడీ ఇవ్వనున్నారు. తోటల్లో పండ్లు తెంపడానికి ప్యాకింగ్, గ్రేడింగ్ చేసేందుకు అవసరమైన గదుల నిర్మాణానికి సంబంధించి జిల్లాకు 9 యూనిట్లు మంజూరు చేశారు. ఒక యూనిట్కు రూ.2లక్షలు అందజేస్తారు. జిల్లాకు 14 ఉల్లిగడ్డ స్టోరేజ్ సెంటర్లు మంజూరయ్యాయి. ఒక యూనిట్కు రూ.87,500 అందజేస్తారు. కాపు కాయని, 15 ఏండ్లు దాటిన మామిడి తోటలు, 10 ఏండ్లు దాటిన బత్తాయి తోటల్లో కొమ్మల కత్తిరింపు, ఎరువుల కోసం హెక్టారుకు రూ.20 వేల వరకు అందజేస్తారు. కాపు కాయని మామిడి, బత్తాయి తోటలకే ఈ సహాయం అందుతుంది.
డ్రిప్, స్ప్రింక్లర్లు 1025 యూనిట్లు
వికారాబాద్ జిల్లాకు 2021-22 సంవత్సరానికి డ్రిప్ 500 యూనిట్లు, స్ప్రింక్లర్లు 525 యూనిట్లు మంజూరు చేయబడ్డాయి. డ్రిప్పు యూనిట్ ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీపై, బీసీ, ఓసీలు 5 ఎకరాల లోపు వారికి 90 శాతం సబ్సిడీ, 5 ఎకరాలు పైగా ఉంటే 80 శాతం సబ్సిడీపై అందజేస్తారు. 100 శాతం సబ్సిడీ అందుకునే రైతులు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాకు 525 స్ప్రింక్లర్ యూనిట్లు మంజూరవగా రైతులకు 75 శాతం సబ్సిడీ అందజేస్తారు. ఒక యూనిట్ స్ప్రింక్లర్ ధర రూ.16 వేలుగా నిర్ణయించారు.
పండ్లతోటలు, కూరగాయల సాగుకు అనుకూలం
జిల్లాలో పండ్లతోటలు, కూరగాయల సాగుకు అనుకూలమైన భూములు ఉన్నాయి. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో నగరానికి అవసరమైన కూరగాయలు, పండ్లు ఈ ప్రాంతంలో పండించి సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నది. ఉద్యానవన పంటలకు ప్రభు త్వం సబ్సిడీ అందిస్తున్నది. డ్రిప్పుకు సంబంధించి రైతుల వాటా చెల్లించలేని వారికి, వివిధ యూనిట్లకు సంబంధించి, అవసరమైతే బ్యాంకు రుణాలు ఇప్పించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.