వికారాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. జిల్లాలో ఉత్తమ మండలాలుగా వికారాబాద్, కోట్పల్లి, మర్పల్లి ఎంపిక కాగా, ఉత్తమ గ్రామాలుగా పులిమద్ది, సాల్వీడ్, తొర్మామిడి గ్రామాలు నిలిచాయి. ఈ మూడు మండలాలు, మూడు గ్రామాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఏ క్షణమైన పల్లెల్లో ఆకస్మిక తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థితిగతులపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..
జిల్లాకు రూ.400 కోట్ల నిధులు
వికారాబాద్ జిల్లాలో 566 పంచాయతీలు, 300లకు పైగా అనుబంధ గ్రామాలు ఉన్నా యి. ఇందులో 7,67,134 జనాభా ఉంది. కాగా పట్టణ ప్రాంతాల్లో మరో 2 లక్షలకు పైగా జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు 2019 సెప్టెంబర్ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ప్రతి నెలా గ్రామాలకు ప్రత్యేకంగా నిధు లు మంజూరు చేసి, అభివృద్ధి పను లు చేపట్టింది. మొదట పారిశుద్ధ్య పనులతో పాటు, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల కూల్చివేయడం, హరితహారంలో మొక్కలు నాటడం, వాటికి నీళ్లు అందించేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేయడం వంటి వాటికి శ్రీకారం చుట్టింది. వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పట్టించడంతో పాటు గ్రామ అవసరాలకు వినియోగిస్తున్నారు. పల్లె ప్రగతి ప్రారంభమైన నుంచి జిల్లాకు రూ.400 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. వీటి ద్వారా పారిశుద్ధ్య పనులు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, సిబ్బంది వేతనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. జిల్లాలో 566 గ్రామాల్లో 560 కంపోస్టు షెడ్లను నిర్మించారు. 560 వైకుంఠధామాలు నిర్మించాల్సి ఉండగా,90 శాతం వరకు పూర్తయ్యాయ్యాయి. 560 పల్లె ప్రగతి వనాలు పూర్తి చేశారు. ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేశారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం బతికి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
100వంద శాతం పన్నుల వసూలు
జిల్లాలోని 566 పంచాయతీల్లో 1,78,226 ఇండ్లకు సంబంధించి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 12 మండలాల్లో వంద శాతం నమోదు కాగా.. మిగిలిన ఆరు మండలాల్లో కొంచెం తక్కువగా పన్ను వసూలైంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్, నాన్ ట్యాక్స్ కలిసి రూ.7కోట్ల 45లక్షల76వేల 404.86లు వసూలు చేయాల్సి ఉండగా.. రూ.7కోట్ల 33లక్షల 82వేల 829లు వసూలు చేశారు. ఇంకా రూ.11 లక్షల 93వేల 575.86లు వసూలు చేసి 98.40 శాతంలో నిలిచారు. పంచాయతీల వారీగా లక్ష్యాన్ని నిర్ధారించడం, పన్ను రాబట్టేందుకు అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోనే ఇది సాధ్యమైందని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. 2020 ఏప్రిల్ నుంచే గ్రామాల్లో పన్ను వసూలు చేయడంతో ఏప్రిల్21 వరకు 98.40 శాతం పన్ను లు వసూల్లు చేశారు. పంచాయతీల ఆదాయ వనరులు పెంచుకోవడంలో ముందంజలో నిలిచింది.
పంచాయతీ ఖాతాల్లో ఫుల్ బ్యాలెన్స్
పంచాయతీల్లో పన్ను వసూలు ఏప్రిల్లో ముగియడంతో అభివృద్ధిపై దృష్టి సారించారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు పంచాయతీల ఖాతాల్లో ఫుల్ బ్యాలెన్స్ ఉంది. పన్ను వసూలుతో ఒక్కో పంచాయతీ ఖాతాలో రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు జమ ఉంది. దీంతో పాటు పంచాయతీలకు ప్రతి నెలా పల్లె ప్రగతి కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అవుతున్నాయి. ఇటు ప్రభుత్వ నిధులు, అటు పన్ను వసూలుతో పంచాయతీల ఖాతాలు కళకళలాడుతున్నాయి.
ముందస్తు ప్రణాళికతో వసూళ్లు
జిల్లాలో పన్నులు రాబట్టేందుకు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వసూళ్లలో వెనకబడిన పంచాయతీలను ముందే గుర్తించి ఎలా వసూలు చేయాలో సిబ్బందికి సూచించారు. పంచాయతీల వారీగా పన్ను వసూళ్ల పర్యవేక్షణకు డీపీవో కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించారు. సదరు అధికారి ప్రతి రోజు పంచాయతీల వారీగా లక్ష్యం, వసూళ్ల శాతాన్ని రిజిష్టర్లో నమోదు చేసుకునేవారు. రోజు వారీ రిపోర్టు ఉన్నతాధికారులకు అందజేస్తుండేవారు. దీంతోఏ పంచాయతీ పన్ను వసూళ్లలో వెనకబడిందో గమనించి ఆ పంచాయతీపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో అధికంగా పన్ను వసూలైంది.
సీఎం చొరవతో మళ్లీ కదలిన జిల్లా యంత్రాంగం
మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వీడి గ్రామాల్లో పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యం లో అన్ని గ్రామాల్లోనూ అధికారులు, సర్పంచ్లు కదిలారు. మిగిలిపోయిన పనులను త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు. మొక్కలకు నీళ్లు పట్టించడం, పారిశుద్ధ్య పనులు, రహదారులు అద్దంలా కనిపించేలా చేస్తున్నారు. గ్రామాలపై కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీపీవో రిజ్వానా ఇతర అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ వారం రోజుల వ్యవధి ఇచ్చిన నేపథ్యంలో అన్ని పనులు పూర్తి చేసి ఏ గ్రామంలోనూ దాదాపుగా సమస్యలు లేకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏ క్షణమైనా ఏ గ్రామానికైనా రావచ్చు అనే సూచనతో అధికారులు, సర్పంచ్లు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎన్ఆర్ఈజీఎస్లో రాష్ట్రస్థాయిలోనే 6వ స్థానం
జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 566 పంచాయతీల్లో లక్ష 87వేల 785 జాబ్ కార్డులకు, 4లక్షల 23వేల 095 కూలీలు ఉన్నారు. 50వేల మంది ప్రతి నిత్యం కూలీ పనులకు వస్తుండడంతో జిల్లా యంత్రాంగం మరింత మంది కూలీ పనులకు వచ్చే విధంగా అవగాహన కల్పించడంతో కూలీల సంఖ్య 80వేలు దాటింది. ప్రస్తుత వానకాలం పంటల సాగు మొదలు కావడంతో కూలీల సంఖ్య తగ్గింది. ఎన్ఆర్ఈజీఎస్లో రాష్ట్రస్థాయిలోనే వికారాబాద్ జిల్లా 6వ స్థానంలో నిలిచింది.