వికారాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేయడానికి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మంత్రి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ ఉధృతి, లాక్డౌన్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుల నుంచి సకాలంలో ధాన్యం సేకరించినందుకు కలెక్టర్లను మంత్రి అభినందించారు.
ధాన్యం నిల్వలకు అనుమతివ్వండి..
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ.. ఈ యాసంగిలో 2020-21 లో ఇప్పటి వరకు 192 కేంద్రాల ద్వారా 18,591 రైతుల నుంచి 98,089,400 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో ఇంకా 20వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రానున్నందున వాటిని భద్ర పరిచేందుకు కొత్త గోదాంలకు అనుమతించాలని, ప్రస్తుతమున్న గోదాంలకు అద్దె మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు. హమాలీలకు చెల్లించాల్సిన కమిషన్ నిధులు కూడా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత పౌరసరఫరాల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి రాజేశ్వర్, సివిల్ సప్లయ్ డీఎం విమల, మార్కెటింగ్ శాఖ అధికారి సబిత పాల్గొన్నారు.
వేగంగా చర్యలు తీసుకోండి
యుద్ధ ప్రాతిపదికన పెండింగ్లో ఉన్న ఆహారభద్రతా కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త ఆహారభద్రతా కార్డుల జారీ, వరిధాన్యం సేకరణ, చౌక ధర దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీ, వారి సమస్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 11, 670మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రైస్మిల్లులకు పంపించినట్లు వెల్లడించారు. ఆహారభద్రతా కార్డుల కోసం కొత్తగా 74,254 దరఖాస్తులు వచ్చాయని, అర్హులందరికీ త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 97 డీలర్ల ఖాళీలు ఉన్నాయని, త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాల మాయదేవి, అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి మనోహర్ రాథోడ్, సివిల్ సప్లయ్ మేనేజర్ శ్యామలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.