పల్లె ప్రగతితో మారిన గ్రామరూపురేఖలు
రూ.13.50లక్షలతో వైకుంఠధామం
47,700 మొక్కల పెంపకం
పచ్చదనం, పరిశుభ్రతలో అగ్రస్థానం
సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు
యాచారం, ఏప్రిల్ 18 : ప్రగతికి ఆ గ్రామం కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. 30రోజుల ప్రణాళిక ఏకంగా ఆ ఊరి ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఒకప్పుడు అనేక సమస్యలతో సతమతమైన గ్రామం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో ఆహ్లాదాన్ని పంచుతూ ఆకట్టుకునే మొక్కలు, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పల్లెపకృతివనం, నర్సరీ, వైకుంఠధామం, తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి డంపింగ్యార్డు, స్వచ్ఛమైన తాగునీటి కోసం మిషన్ భగీరథ ట్యాంకులు, ప్రధాన వీధుల్లో మిరుమిట్లు గొలిపే ఎల్ఈడీ బల్బులు, సీసీ రోడ్లు, బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రతను పెంపొందించే భూగర్భ డ్రైనేజీ, తడి, పొడి చెత్త సేకరణ కోసం పంచాయతీ ట్రాక్టర్, మొక్కలకు నీరందించేందుకు నీటి ట్యాంకర్ తదితర వసతులతో అభివృద్ధిలో కుర్మిద్ద గ్రామం దూసుకుపోతున్నది. సర్పంచ్ బందె రాజశేఖర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్రెడ్డి ప్రణాళికతో గ్రామ పంచాయతీ ప్రగతిబాటన పయనిస్తున్నది.
ప్రగతికి కేరాఫ్..
కుర్మిద్ద గ్రామపంచాయతీ, గ్రామానికి మర్లకుంటతండా, మంగలిగడ్డతండాలు అనుబంధంగా ఉన్నాయి. గ్రామంలో సుమారు 5000ల జనాభా ఉంది. ఇప్పటికే గ్రామంలో మూడు పాడుబడిన పురాతన బావులు, శిథిలావస్థకు చేరిన 33ఇండ్లు పూడ్చివేయడంతో పాటుగా రోడ్లకు ఇరువైపులా ఉన్న కలుపు మొక్కలు, ముండ్ల పొదలను తొలిగించారు. గుంతలను మట్టితో నింపి చదును చేశారు. పంచాయతీ సిబ్బంది రోడ్లు, వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ను చల్లుతున్నారు. గ్రామంలో రూ.13.50లక్షలతో వైకుంఠధామం, రూ.2.50లక్షలతో డంపింగ్యార్డు, రూ. 20లక్షల నిధులతో సీసీరోడ్లు, రూ. 20లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. రూ.9.20లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను కొనుగోలు చేశారు. 150ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. 100శాతం ఇంటిపన్నుల వసూళ్లు, వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది.
అన్ని వర్గాలకు ఒకే చోట..
కుల, మత, జాతి విభేదాలు లేకుండా ఒకే చోట దహన సంస్కారాలు చేసేందుకు వైకుంఠధామాన్ని మౌలిక వసతులతో రూ. 13.50లక్షలతో నిర్మించారు. రెండు శ్మశాన వాటికలు, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గది, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఇంటింటికీ తాగునీరు సరఫరా..
ఒకప్పుడు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ అనేక వ్యాధుల బారిన పడిన ప్రజలు ప్రస్తుతం స్వచ్ఛమైన తాగునీరుతో అలాంటి సమస్యలకు శాశ్వతంగా దూరమయ్యారు. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికీ 830నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరును సరఫరా చేస్తున్నారు. దీనికోసం 5ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులున్నాయి. కుర్మిద్ద, మర్లకుంటతండా, మంగలిగడ్డతండాలకు సక్రమంగా సరిపడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
ముమ్మరంగా మొక్కల పెంపకం
గ్రామంలో పల్లెపకృతి వనంలో 670 మొక్కలు, హరితహారం ద్వారా 2,500, నర్సరీలో 12,000, కేసీఆర్ పుట్టిన రోజున కోటివృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో 400మొక్కలను ముమ్మరంగా పెంచుతున్నారు. పల్లె ప్రకృతి వనం ద్వారా వివిధ రకాల ఔషధ, పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. నర్సరీ మొక్కలు వేసవిని తట్టుకునేలా గ్రీన్నెట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వీధుల్లో, ఇంటింటికీ ముమ్మరంగా మొక్కలు నాటారు. వాటికి ట్రీగార్డులను సైతం ఏర్పాటు చేసి, నిత్యం మూడు ట్యాంకర్ల ద్వారా నీరుపోసి సంరక్షిస్తున్నారు.
ట్రాక్టర్ ద్వారా నిత్యం చెత్త సేకరణ
కుర్మిద్ద గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి రూ.2.50లక్షలతో డంపింగ్యార్డును నిర్మించారు. ఇండ్లల్లో పేరుకుపోయిన చెత్తను గ్రామపంచాయతీ టాక్టర్ ద్వారా సేకరించి గ్రామంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. సేంద్రియ ఎరువును తయారు చేసి నర్సరీ, పల్లెపకృతి వనంలో మొక్కలకు వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కొండపల్లి ఘటనలో బీజేపీ నాయకులతో పాటు మరో 20 మంది అరెస్టు