వికారాబాద్, జూన్ 17, (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేని వెంచర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నది. పల్లెల్లో అక్రమ లే అవుట్లను అడ్డుకునేందుకు పల్లెలోనూ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం ఆన్సెల్ప్ సర్టిఫికేషన్(టీఎస్ బీ-పాస్) పరిధిలోకి తీసుకువచ్చింది. మున్సిపల్ శాఖలో సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం రెండేళ్ల క్రితం టీఎస్ బీ -పాస్కు శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ నిర్ణయాన్ని గ్రామీణ పల్లెలకు వర్తింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ లే అవుట్లు, ఇంటి నిర్మాణాల అనుమతుల కోసం ఇకపై టీఎస్ బీ-పాస్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండనున్నది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్కుమార్ పదిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో లే అవుట్లు, భవన నిర్మాణాలకు టీఎస్ బీ-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న మాదిరిగా గ్రామ పంచాయతీల పరిధిలో సైతం ఇదే వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
వెంటనే అనుమతులు..
టీఎస్ బీ-పాస్ వ్యవస్థను తీసుకువచ్చిన తర్వాత భవన నిర్మాణాల అనుమతి చాలా వేగంగా మారింది. కొద్ది రోజుల క్రితం వరకు భవన నిర్మాణదారులు మున్సిపాలిటీల్లోని గుర్తింపు పొందిన లైసెన్స్ సర్వేయర్ల ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఈ విధానంలో నెలలు దాటినా అనుమతులు వచ్చేవి కావు. టీఎస్ బీ-పాస్ వచ్చిన తర్వాత దరఖాస్తుదారులకు కేవలం 21రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వారంలో ఆన్లైన్లో ఆటోమెటిక్గా అనుమతి లభిస్తున్నది. ఈ మార్పుతో అంతా సులువుగా అనుమతులు లభిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో ప్రస్తుతం టీఎస్ బీ-పాస్ ద్వారానే అనుమతులు వస్తున్నాయి.
జిల్లా స్థాయిలో కమిటీలు ..
గ్రామాల్లో సైతం ఇక నుంచి టీఎస్ బీ-పాస్ను అమలుకు శ్రీకారం చుట్టడంతో జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. టీఎస్ బీ-పాస్ తోనే భవన నిర్మాణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తే .. వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి కలెక్టర్ పౌసుమిబసు అధ్యక్షతన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీ తరఫున టీపీవో, రెవెన్యూ శాఖ తరఫున రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సభ్యులుగా నియమించారు. ఈ బృందాలకు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్నారు.
అనుమతులు ఇలా..
కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే నిర్మాణాదారులు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ యాప్, వెబ్సైట్లో లేదా మీ-సేవ, ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి నిర్మాణం చేసే వ్యక్తి tsbpass.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్లి భవన నిర్మాణ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత స్థలం, సర్వేయర్ ద్వారా డాక్యుమెంటేషన్, భవన నిర్మాణ ప్లాన్, సెట్ బ్యాంక్ తదితర వివరాలతో ఆప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ డ్రాయింగ్ను సాఫ్ట్వేర్ రీడ్ చేసి నిబంధనల ప్రకారం ఉందా.. లేదా..? అనేది ధ్రువీకరిస్తున్నది. భవన నిర్మాణదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సింగిల్ విండో ద్వారా 21 రోజుల్లో అనుమతులు వస్తాయి. భవన నిర్మాణానికి సంబంధించి పత్రాలన్నీ సక్రమంగా ఉంటేనే అనుమతి వస్తుంది. ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చిన్నైట్లెయితే ఆయా శాఖలు ఆ భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్ల విషయంలో కూడా ఇదే విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు, నిబంధనలు సైతం ఇవే వర్తిస్తాయి.
560 గ్రామ పంచాయతీల పరిధిలో..
పల్లెలోనూ అక్రమ లే అవుట్లు, ఇంటి నిర్మాణాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తాజాగా వీటిని టీఎస్ బీ-పాస్కు లింక్ చేసింది. ఇక నుంచి అక్రమ లే అవుట్ల ద్వారా ప్లాట్లు కొనుగోలు చేస్తే వాటిని విక్రయించరాదని, టీఎస్ బీ-పాస్లోనే దరఖాస్తు చేసుకోవాలని, భవన నిర్మాణాలకు కూడా ఇదే వర్తిస్తున్నదని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా 560 గ్రామ పంచాయతీలు, 300లకు పైగా అనుబంధ పంచాయతీలు ఉన్నాయి. గ్రామీణ జనాభా 7లక్షల 67వేల 134 ఉండగా, పట్టణ జనాభా 2లక్షలకు పైగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ప్రజలు నివసిస్తున్నారు. కాగా.. మున్సిపల్ పట్టణాలకు ఆనుకొని ఉన్న పల్లెల్లో శరవేగంగా పంట పొలాలు వెంచర్లుగా చేస్తున్నారు. కొంతమంది మాత్రమే లే అవుట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మరికొంత మంది రియల్ వ్యాపారులు అనుమతులు లేకుండానే అక్రమ లే అవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన అమాయక ప్రజలు అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఇక నుంచి అలా చేసే వారి లే అవుట్లు రద్దు చేయడంతో పాటుగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవు.