యాలాల, మే 17: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు కరోనా నియంత్రణా చర్యలు పాటించాలన్నారు. మండల ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జ్వరం, పొడి దగ్గు, అలసట, ఒంటి నొప్పులు, గొంతు మంట, అతిసారం, కండ్లకలక, తలనొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, చర్మంపై దద్దుర్లు, చేతి లేదా కాలి వేళ్లు రంగు మారడం వంటి లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, ఒత్తిడి, మాట్లాడడంలో తడబాటు వంటి తీవ్ర లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. వైరస్ లక్షణాలు బయట పడడానికి 5 నుంచి 6 రోజులు పడుతున్నాయన్నారు. కొందరిలో 14 రోజులు కూడా పట్టవచ్చన్నారు. ఐసొలేషన్లో ఉన్న ప్రతిఒక్కరూ సంగీతాన్ని వింటూ యోగా చేయాలన్నారు. మూడు పూటలా పౌష్టికాహారాన్ని అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ, చైర్మన్ మురళీగౌడ్, వైస్ ఎంపీపీ రమేశ్, జిల్లా కో ఆప్షన్ అధ్యక్షుడు అక్బర్ బాబా, ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.
బీసీ హాస్టల్లో ఐసొలేషన్ కేంద్రం
కరోనా సోకి ఇండ్లలో సరియైన సౌకర్యాలు, వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల కోసమే ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి దరిచేరకుండా ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఐసొలేషన్ కేంద్రంలో స్వచ్ఛందంగా బాధితులకు సేవలు అందించడానికి ఆర్ఎంపీ డాక్టర్లు ముందుకు రావడం సంతోషమన్నారు. మూడు పుటలా భోజనాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు డివై నర్సింలు, నాయకులు నరేశ్రెడ్డి, టి.రమేశ్, అంజిల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఆజం ఖాన్, సంజీవరెడ్డి, సంగమేశ్వర్, శిబ్లి, విద్యాసాగర్, మెడికల్ ఆఫీసర్ డా॥ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఉప్పరి మల్లేశం, కారోబార్ నర్సిరెడ్డి, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మూడు పూటలా భోజనం, వైద్యుల పర్యవేక్షణ
కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేందుకు ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ పాఠశాల, మంతట్టి గ్రామంలో రైతువేదికలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఐసొలేషన్ కేంద్రానికి వచ్చే బాధితులకు మూడు పూటలా నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, వైద్యుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించడంతో కరోనా నియంత్రణకు అడ్డుకట్టవేయవచ్చాన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీగౌడ్, నాయకులు నర్సిరెడ్డి, మునీందర్రెడ్డి, రామునాయక్, వెంకట్రెడ్డి, మాధవ్రెడ్డి, రజాక్, రవిందర్సింగ్, సునీల్ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.