వికారాబాద్, జూన్ 16, (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత వానకాలం సీజన్లో జిల్లాలో దాదాపుగా 6లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వాణిజ్య పంటలతో పాటు కూరగాయల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేశారు. వరి, పత్తి, కందుల పంటలు వేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. జీలుగ, జనుము వంటి విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తారు. ఈ ఏడాది వరి సాగును తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 2,39,926 మంది రైతులున్నారు. మొత్తం రూ.311.69 కోట్లు రైతులకు పంట పెట్టుబడి కింద అందజేయాల్సి ఉంది. మొదటి రోజు రైతుల ఖాతాల్లోకి రూ.16.35కోట్లు జమ కాగా.. 48,554 మంది రైతులు లబ్ధిపొందారు. మొదటి రోజు ఎకరా, ఎకరాలోపు ఉన్న 48,554 రైతులకు వారి ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున జమయ్యాయి. చివరి ఎకరా వరకు రైతు బంధు కింద డబ్బులు ఖాతాల్లో జమవుతాయని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తెలిపారు. ఈ నెలాఖరులోగా జిల్లాలోని రైతులందరికీ నగదు జమ అవుతుందని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 4,76,283 కాగా.. 5,97,220 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. కేవలం పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,13,192 కాగా.. 2,73,963.21 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వానకాలం పంటలు వంద శాతం దాటి అదనంగా 26.20కి రావొచ్చని అధికారులు తమ ప్రణాళికల్లో పేర్కొన్నారు.
ఎరువులు, విత్తనాల నాణ్యతా ప్రమాణాలు తనిఖీ
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు పోలీస్ అధికారులతో టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రతి దుకాణంలో ఎరువులు, విత్తనాలు.. వాటి నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నారు. నకిలీ విత్తనాలను గుర్తించడమే కాకుండా గడువు తీరిన విత్తనాలను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో 18 మండలాల్లో టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేసి కల్తీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు చేపట్టింది.
పప్పు ధాన్యాల సాగు పెరిగే అవకాశాలు..
వరి సాగు తగ్గించి ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరి, మొక్కజొన్న సాగును తగ్గిస్తూనే పత్తి, కంది, పెసర, జొన్న, మినుములు సాగు చేసేలా అధికారులు రైతులను చైతన్యపరుస్తున్నారు. పప్పుధాన్యాల మినీ కిట్స్ అందజేస్తున్నారు. కాగా.. సజ్జ, రాగి, కొర్ర, చెరుకు, అండుకొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.97లక్షల ఎకరాల్లో కంది పంట అధికంగా సాగయ్యే అవకాశాలున్నాయి.