తాండూరు, మే 16 : ప్రభుత్వం విధించిన తాండూరు నియోజకవర్గంలో ఐదో రోజు ఆదివారం లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోగా, ఉదయం 10 గంటల తర్వాత నిబంధనల ప్రకారం షాపులు మూతపడ్డాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు, వీధుల్లో పోలీసుల పహారా కొనసాగింది. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, జరిమానాలు విధించారు. గ్రామాల్లో ఉపాధి హామీ, వ్యవసాయ పనులు, ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా జరిగాయి.
పరిగిలో..
పరిగి, మే 16: పరిగిలో ప్రశాంతంగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు ప్రజలు దుకాణాల్లో సరుకులు తీసుకువెళ్లడానికి రాగా 10 తర్వాత దుకాణాలు మూత పడటంతో పరిగిలో చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. పరిగి ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో లాక్డౌన్ను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.
పెద్దేముల్లో..
పెద్దేముల్, మే16 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు మండల ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న లాకడౌన్కు మండల, ఆయా గ్రామాల ప్రజలు అధికారులు సహకరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తమ పనులు, నిత్యావసర సరుకుల కొనుగోలు చేసి, ఇతర పనులను ముగించుకొని లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇండ్లకే పరిమితమవుతున్నారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో జనాలు బయట తిరుగకపోవడంతో ప్రధాన రోడ్లు, పలు కాలనీలు నిర్మానుష్యంగా మారిపోయాయి. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో బయటికి రావద్దు
పూడూరు, మే 16 : కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో ఎవరు కూడా బయటికి రాకుండా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని చన్గోముల్ ఎస్సై శ్రీశైలం తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు ప్రశాంతంగా లాక్డౌన్ పాటించారు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఉదయం10 గంటల తర్వాత వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామాల్లో దుకాణాలు ఉదయం10 గంటల తర్వాత మూసి వేయకుంటే వ్యాపారులపై చట్టరీత్యా కేసు నమోదు చేస్తామన్నారు.