జిల్లాలో 2,22,389 కుటుంబాల్లో ఫీవర్ సర్వే
వీరిలో 6,026 మందికి కిట్లు, మందులు పంపిణీ
ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ
కరోనా నేపథ్యంలో 661 బృందాలతో ఇంటింటి జ్వర సర్వేను వికారాబాద్ జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న 6,026 మందికి మెడికల్ కిట్లను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,22,389 కుటుంబాలకు పరీక్షలు చేయగా, 6,737 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సర్వే బృందాలు పేర్కొన్నాయి. జిల్లాలో అధికంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే వెంటనే సమాచారం ఇవ్వాలని వైద్య బృందాలు బాధితులకు సూచించారు. పాజిటివ్ వచ్చినవారు భయాందోళనకు గురికాకుండా వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని, తప్పనిసరి అయితేనే దవాఖానకు రావాలని అవగాహన కల్పించారు. జిల్లాలో ప్రస్తుతం 14 ప్రైవేటు దవాఖానల్లో చికిత్సలు అందుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
వికారాబాద్, మే 15, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే పూర్తైంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్, వీఆర్ఏలు, మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. 6,333 మంది స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారందరికీ వైద్య సిబ్బంది కిట్లు, మందులు అందజేశారు.
6,026 మందికి కిట్లు, మందులు అందజేత
కరోనా వైరస్ సెంకడ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెంది ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే ఇంట్లో మిగిలిన వారు కూడా కొవిడ్ వ్యాప్తి చెందుతున్నది. మొదటి దశలో పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది తొందరగా కోలుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు కొద్ది మంది మాత్రమే మృత్యువాతపడ్డారు. రెండో దశలో బాధితుల్లో ఎక్కువ మంది దవాఖానల్లో చేరుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయి ఆందోళన పడుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, గుండెపోటు తదితర కారణాలతో ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఈ నేఫథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ప్రారంభ దశలోనే లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేపట్టారు. ఈనెల 6వ తేదీ నుంచి జిల్లాలోని 18 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో సిబ్బంది సర్వే నిర్వహించారు. జిల్లాలో 2లక్షల 22వేల 389 కుటుంబాల్లో ఫీవర్ సర్వే నిర్వహిస్తే 6,333 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వారిలో 6,026 మందికి కిట్లు, మందులు అందించారు. జిల్లాలో ప్రస్తుతం 14 ప్రైవేట్ దవాఖానల్లో ప్రధానంగా చికిత్సలు అందిస్తున్నప్పటికీ ప్రధానంగా 3 దవాఖానల్లో ఎక్కువ సంఖ్యలో రోగులకు కొవిడ్ వైద్యం అందుతున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 36వేల 596 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 6737 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 76వేల 182 మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా.. మరో 46వేల మందికి రెండో డోస్ వేయాల్సి ఉంది.
661 బృందాలతో..
గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ
సెక్రటరీలు, వీఆర్ఏలు, మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బందితో కలిసి ఆశా, అంగన్శాడీ కార్యకర్తలు ఇంటింటి జ్వర సర్వే చేపట్టారు. వికారాబాద్ జిల్లాలో 18 మండలంలోని 566 గ్రామ పంచాయతీల పరిధిలో 1,83,980లక్షల ఇండ్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 7,67,134 లక్షలకు పైగా జనాభా ఉన్నది. 661 బృందాలతో జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. ఒక్కో బృందం 500 కుటుంబాలను సర్వే చేసింది. ఈ 661 బృందాలు 1,83,980లక్షల ఇండ్లకు వెళ్లి వివరాలు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీ సర్వే మొదలు పెట్టగా.. ఈనెల 12వ తేదీతో ముగిసింది. అప్పటికే కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిని ఈ సర్వేలోకి పరిగణలోకి తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారి వివరాలను సేకరించారు. జిల్లాలో అధికంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నట్లు గుర్తించారు.
లక్షణాలతో బాధపడితే తెలుపండి..
ఇంటింటి సర్వే నిర్వహించిన అనంతరం వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఈనెల 12తో సర్వే ముగిసినప్పటికీ మరో వారం రోజుల పాటు ఆయా బృందాలు బాధితుల ఇంటికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే వెంటనే సమాచారం ఇవ్వాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులకు సూచనలు తెస్తున్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య సేవలు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నారు.